V6 News

ప్రోత్సాహం లేక రోజు కూలీగా పని చేస్తున్న యువ బాక్సర్

ప్రోత్సాహం లేక రోజు కూలీగా పని చేస్తున్న యువ బాక్సర్

టోక్యో ఒలింపిక్స్​లో భారత అథ్లెట్స్ అద్భుతమైన ప్రదర్శనతో  దేశానికి పతకాలను సాధించి.. జాతీయ జెండాను రెపరెపలాడించారు. దీంతో విజేతలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీసీసీఐ ప్రశంసలు, బహుమతుల వర్షం కురుపించాయి. గతంలో జరిగిన అన్ని ఒలింపిక్స్​తో పోల్చకుంటే టోక్యో ఈవెంట్స్​లోనే మనోళ్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. అనేక కొత్త రికార్డులు సృష్టించారు. తొలిసారి ఏడు మెడల్స్​గెలిచారు. అథ్లెటిక్స్​లో తొలి గోల్డ్ మెడల్ సాధించారు. ఇన్ని విజయాలను సొంతం చేసుకున్నా.. ఒలింపిక్స్​ మెడల్ టేబుల్​లో మన దేశం 48వ స్థానంలోనే ఉండిపోయింది. చిన్న చిన్న దేశాలు కూడా మన కంటే ఎంతో ముందు నిలిచాయి.

లోపం ఎక్కడ?

ఒలింపిక్స్ వచ్చిన ప్రతిసారి ఇన్నే మెడల్స్ వచ్చాయంటూ దేశమంతా ఒక చిన్న నిరాశతో కనిపిస్తుంది. వచ్చి కొద్ది మెడల్స్​తో సంబురాలు జరుపుకుంటుంది. లోపం ఎక్కడుందా అని ఆ నాలుగు రోజులు అనుకుని ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోతారు. ప్రభుత్వాలు గెలిచిన వాళ్లకు బహుమతులు ఇవ్వడంతో పాటు గేమ్స్​పై ఆసక్తి, ప్రతిభ ఉన్నవాళ్లను గుర్తించి ప్రోత్సాహిస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. దీని కోసం ఏదో మాయలు, మంత్రాలు చేయక్కర్లేదు. స్కూల్, కాలేజీ స్థాయిల్లో జరిగే స్టేట్ లెవెల్ పోటీలు, జాతీయ క్రీడల్లో రాణించిన యువ క్రీడాకారులను గుర్తించి వారు ఆటల్లో మరింత ప్రతిభను పెంచకునేందుకు శిక్షణ, ఆర్థిక సాయం లాంటి చేస్తే చాలు.

పార్కింగ్ టికెట్లు అమ్ముతున్న యువ బాక్సర్

మన దేశంలో యువ శక్తికి కొదవలేదు. టాలెంట్ ఉండి కూడా పైకి రాలేకపోయిన మట్టిలో మాణిక్యాలను లెక్కగట్టడం కూడా కష్టమేనేమో! అలాంటి ఓ ప్లేయరే  చండీగఢ్​కు చెందిన 23 ఏండ్ల యువ బాక్సర్  రీతూ. స్కూల్, కాలేజీ చదువు సాగుతుండగా నేషనల్ టోర్నమెంట్స్​లో ఆడి మెడల్స్ గెలిచింది. కానీ  ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేక పార్కింగ్ టికెట్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తోంది. ప్రభుత్వం సపోర్ట్ చేయక, శిక్షణ గానీ, స్కాలర్‌‌షిప్‌లు అందక 2017లో బాక్సింగ్‌ను వదిలేసింది. చివరికి గత్యంతరం లేక తన కుటుంబానికి అండగా ఉండేందుకు చండీగఢ్‌లో పార్కింగ్ టిక్కెట్లను అమ్ముతోంది.

కుటుంబ సభ్యులు తనకు ఎంతో అండగా నిలిచారని తెలిపింది రీతూ. అయితే ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ప్రోత్సాహకాలు, స్కాలర్‌షిప్‌లు రాలేదని తెలిపింది. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని కాపాడుకునేందుకు, ఆర్థిక అవసరాలకోసం తనకెంతో ఇష్టమైన క్రీడలను విడిచిపెట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ముగ్గురు సోదరులు ఉన్నారని, వాళ్లంతా మొహాలీ, చండీగఢ్‌లలో కూలీ పనులు చేస్తున్నారని, అయినప్పటికీ తండ్రి వైద్య ఖర్చులు, కుటుంబపోషణకు చాలకపోవడంతో చండీగఢ్​లోని శాస్త్రి మార్కెట్ పార్కింగ్​లో టికెట్లు ఇచ్చే పనికి చేరానని రీతూ తెలిపింది. తనకు రోజువారీ కూలీగా రూ.350 చొప్పున ఇస్తారని ఆమె చెప్పింది. ఇప్పటికైనా ప్రభుత్వం తనకు ప్రోత్సాహం ఇచ్చి, కొంత ఆర్థిక సహకారం చేస్తే మళ్లీ దేశం కోసం ఆడాలని ఆశగా ఉందని రీతూ ఆవేదనగా చెప్పింది.