
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ‘బాలికే భవిష్యత్’ పేరుతో జిల్లాలో జిల్లా,డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో ని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో ఒక రోజు కార్యాలయపు అధికారిగా బాలికకు పదవీ అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని మండలాలో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ ,రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా బాలికలు బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా కలెక్టర్గా కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.శ్రావణి ఎంపికైంది. జిల్లా కలెక్టర్గా ఆమె ఇవాళ బాధ్యతలను నిర్వహించారు. చీరకట్టులో వచ్చిన శ్రావణి కలెక్టర్ కుర్చీలో కూర్చోగా పక్కనే చంద్రడు చేతులు కట్టుకుని నవ్వుతూ కనిపించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ పదవిలో బాలికే కొనసాగారు. ఈ సమయంలో అధికారిణులుగా బాధ్యతలు స్వీకరించిన వారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేయాలని కలెక్టర్ చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. తనిఖీలు నిర్వహిస్తామంటే వారికి అవకాశం కల్పించాలని ఆదేశించారు.