- పట్టణ పేదలకు పెద్దన్న రేవంత్రెడ్డి కానుకగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తంబంజారాహిల్స్లో
- ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన మంత్రి
హైదరాబాద్, వెలుగు: క్యూర్ (జీహెచ్ఎంసీ) పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తొలి విడత లక్ష ఇండ్లకు శంకుస్థాపన చేస్తామని, ఏడాది తిరిగేలోపే ఈ నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మలి విడతలో మరో లక్ష ఇండ్లను నిర్మిస్తామని వెల్లడించారు. పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్నగా ‘ఇందిరమ్మ ఇండ్ల’ కానుకను అందించబోతున్నారని ప్రకటించారు.
ప్రజా ప్రభుత్వ పథకాలను నేరుగా పేదవాడి గుమ్మం వద్దకే తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించామని, హౌసింగ్, రిజిస్ట్రేషన్ శాఖల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. శనివారం బంజారాహిల్స్లో ‘ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సముదాయం’ (సమీకృత భవనం) నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా పేదలను నగరానికి 30, 40 కిలోమీటర్ల అవతలకు పంపించే ప్రసక్తే లేదని, పట్టణ పేదల జీవనోపాధి దెబ్బతినకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతన ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని, ఎక్కడి పేదలకు అక్కడే ఇండ్లు కట్టిస్తామని చెప్పారు.
ఒకే గొడుగు కిందకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సర్వే శాఖలు
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సర్వే తదితర శాఖల సేవలను ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకే ఈ సమీకృత భవనాల నిర్మాణాలు చేపడుతున్నామని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వివరించారు. 3 కార్పొరేషన్ల పరిధిలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటు రంగానికి దీటుగా, కార్పొరేట్ తరహాలో అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా.. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రసిద్ధ సంస్థ అయిన ‘ఫీనిక్స్’కు ఈ బాధ్యత అప్పగించామని, మరికొద్ది నెలల్లోనే 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక భవనాన్ని ఆ సంస్థ పూర్తి చేసి ఇస్తుందన్నారు.
బంజారాహిల్స్ సమీకృత భవనంలో ఎస్.ఆర్. నగర్, బంజారాహిల్స్, గోల్కొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులతోపాటు డీఐజీ కార్యాలయం, రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ (గోల్కొండ) ఆఫీసులు ఒకేచోటకు రానున్నాయని, దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకు మరిన్ని ఉద్యోగ, వ్యాపార సౌకర్యాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
