ఆ వ్యక్తికి ఆరు రోజులుగా తలనొప్పి వస్తోంది. ఎన్ని ట్లాబ్లెట్లు వేసుకుంటే ఏం లాభం, ఆ నొప్పి మాత్రం పోలేదు. ఇక, నొప్పి భరించలేక ఓ ఆస్పత్రికి వెళితే, డాక్టర్ స్కానింగ్ తీశాడు. ఓ షాకింగ్ విషయం బయటపడింది. ఆరు రోజులుగా తలలో బుల్లెట్ మోస్తున్నాడు ఆ వ్యక్తి. అవును, కొద్ది రోజుల క్రితం యూపీలోని గ్రేటర్ నోయిడాలో జరిగింది ఆ ఘటన. ఆ బుల్లెట్ ఉండడానికీ కారణముంది. ఆ కారణమేంటి? పోయిన ఆదివారం, గ్రేటర్ నోయిడాలో ఆరుగురు ప్రయాణిస్తున్న ఓ ఆటో ట్రాలీపైన కొందరు వ్యక్తులు బైకులపై వచ్చి కాల్పులు జరిపారు. ఆ ఘటనలో డంకౌన్ ప్రాంతానికి చెందిన షరీఫ్ ఖాన్అనే వ్యక్తి పుర్రెలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే అతడిని అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వాళ్లు మెడికో లీగల్ కేసుగా రిపోర్టు రాసి, నోయిడాలోని పెద్దాస్పత్రికి పంపారు. నోయిడా హాస్పిటల్లో అతడికి డాక్టర్లు ఎక్స్రే తీశారు. రిపోర్టు కోసం మంగళవారం రావాలని చెప్పారు. మంగళవారం వస్తే అప్పటికే లేట్అయింది మరునాడు రమ్మన్నారు. ఇంటికి వెళ్లిపోయిన షరీఫ్ ఖాన్ నొప్పి భరించలేక శుక్రవారం ఓ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పాడు. నిశితంగా పరిశీలించిన ఆ డాక్టర్ తలలో బుల్లెట్ఉన్నట్లు గుర్తించారు. దీంతో షరీఫ్ ఖాన్ కుటుంబ సభ్యులు, బంధువులకు విషయం తెలిసి, జిల్లా ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. అప్పటికి గానీ హాస్పిటల్ డాక్టర్లలో కదలిక రాలేదు. హాస్పిటల్ ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అభిషేక్ త్రిపాఠి వెంటనే స్పందించారు. ఎక్స్రే రిపోర్టును వెంటనే తెప్పించుకుని చూడగా అందులో బుల్లెట్ స్పష్టంగా కనిపించింది. ఇదంతా రేడియాలజిస్ట్ నిర్లక్ష్యం వల్ల జరిగిందని, బుల్లెట్ ఉందని ఎందుకు చెప్పలేదో తాము తెలుసుకుంటామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశిస్తున్నట్లు చెప్పారు. వెంటనే ఆపరేషన్కు ఏర్పాట్లు చేస్తున్నామని, షరీఫ్ ఖాన్ తలలోని బుల్లెట్ను తొలగిస్తామని వెల్లడించారు.