పంజాగుట్ట, వెలుగు: పేదల కలలను సాకారం చేయడం ప్రజాప్రభుత్వంతోనే సాధ్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12, ఎన్బీటీ నగర్లో రూ.8.5 కోట్లతో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ఖరీదైన ప్రాంతంలో ఇలాంటి ఫంక్షన్ హాల్ నిర్మాణం మహిళలు, విద్యార్థులు, కుల సంఘాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అంతర్గత రోడ్లు, జీహెచ్ఎంసీ అధికార వికేంద్రీకరణతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.
గతంలో నగరానికి తాగునీటి సమస్యలు ఉండేవని, ప్రస్తుతం గోదావరి, కృష్ణ, సింగూరు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్
పాల్గొన్నారు.
