సిరిసిల్ల నేతన్నలకు బీఆర్ఎస్, వైసీపీ జెండాల ఆర్డర్లు

సిరిసిల్ల నేతన్నలకు బీఆర్ఎస్, వైసీపీ జెండాల ఆర్డర్లు

తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీల ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు ఇప్పటికే అందాయి. రెండు రోజుల కింద అందిన ఆర్డర్లతో సిరిసిల్ల నేత కార్మికులు ఉత్పత్తి పనులు ప్రారంభించారు. పార్టీ జెండా తయారీకి మీటరున్నర వస్త్రం, కండువా తయారీకి మీటర్ వస్త్రాన్ని వాడుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ 5 లక్షల మీటర్ల ఆర్డర్లను ఇచ్చింది. 

వైసీపీ కూడా 5 లక్షల మీటర్ల ఆర్డర్లను ఇచ్చింది. ప్రస్తుతానికి రెండు పార్టీలకు సంబంధించిన జెండాలు, కండువాలను తయారు చేస్తున్నారు. జెండాలు తయారు చేసే నేతన్నలు రూ.9 చొప్పున మీటరు వస్త్రాన్ని కొనుగోలు చేస్తారు. దీనికి ప్రింటింగ్ కోసం రూ.8 ఖర్చవుతుంది. ఒక జెండా తయారీకి 17 రూపాయలు ఖర్చవుతుంది. ఉత్పత్తిదారులు ఈ జెండాలను రూ.18నుంచి రూ.19కు విక్రయిస్తున్నారు.

 

త్వరలో ఇతర పార్టీల జెండాల ఆర్డర్లు

ఎలక్షన్ టైమ్ లో సిరిసిల్లలో వివిధ పార్టీలు జెండాల తయారీ కోసం సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్ లు ఇస్తారు. అయితే ఈ సారి ముందుగా అధికార పార్టీ 115 మందిని ఎమ్యెల్యే అభ్యర్థులుగా ప్రకటించింది. 

అధికార పార్టీకి సంబంధించిన ఆర్డర్లు సిరిసిల్లకు అందాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించిన వెంటనే ఆర్డర్లు వస్తాయని తయారీదారులు చెబుతున్నారు.