తయారు చేసిన ప్యూర్ఈవీ స్టార్టప్.. ఐఐటీ హెచ్ టెక్నికల్ సాయం
హైదరాబాద్, వెలుగు:మొట్టిమొదటి సారిగా తెలుగోళ్లు తయారు చేసిన ఈ–స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. ఐఐటీ హైదరాబాద్ ఇంక్యుబేషన్ సెంటర్లో పురుడు పోసుకున్న ‘ప్యూర్ఈవీ’ అనే స్టార్టప్ ‘ఈప్లూటో7జీ’ అనే కరెంట్ స్కూటర్ను తయారు చేసింది. అందుకు ఐఐటీ హెచ్ టెక్నికల్ సపోర్ట్ను అందించింది. స్కూటర్ల తయారీ కోసం దాదాపు 18 వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో ప్యూర్ఈవీ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఆదివారం ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో ఈప్లూటో7జీని ఘనంగా లాంచ్ చేశారు. కార్యక్రమానికి నీతిఆయోగ్ సభ్యుడు వి.కె. సారస్వత్, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి. సతీశ్ రెడ్డి, ఐఐటీ హెచ్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. రవాణా వ్యవస్థలో కరెంట్ బండ్లు మంచి మార్పును తీసుకొస్తాయని, ఆధునిక రవాణా రంగానికి ఎలక్ట్రానిక్ ట్రాన్స్పోర్టేషన్ కీలకం అవుతుందని వి.కె. సారస్వత్ అన్నారు. ప్యూర్ఈవీ స్టార్టప్, ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించిన మొదట్లో తానూ అందులో భాగస్వామినయ్యానని, ఇప్పుడు దానిని ప్రారంభిస్తున్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. ఐఐటీ హెచ్ ఇన్నోవేషన్స్కు ఇది ఈప్లూటో హాల్మార్క్ లాంటిదన్నారు. బండిలోని సప్లై చెయిన్ బ్యాటరీకి చాలా ప్రాముఖ్యం ఉందని అన్నారు. ఈప్లూటోలో వాడిన బ్యాటరీ, థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇంటిగ్రేషన్, కంట్రోల్స్ను పూర్తిగా దేశంలోనే తయారు చేశారని ఆయన చెప్పారు. దాదాపు 70 శాతం మెటీరియల్ను కంపెనీనే సొంతంగా తయారు చేసుకుందన్నారు. ఈ ఫ్లూటో 7జీ వెహికిల్ బాగుందని డీఆర్డీవో చైర్మన్ జి. సతీశ్ రెడ్డి అన్నారు. లిథియం బ్యాటరీస్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ రావడం సంతోషంగా ఉన్నారు. మిలటరీ టెక్నాలజీలోనూ ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయన్నారు.
5 గంటల చార్జింగ్.. 120 కిలోమీటర్ల జర్నీ
రెండు రకాల మోడళ్లను కంపెనీ తీసుకొస్తోంది. ఈప్లూటో, ఈప్లూటో7జీ. ఈప్లూటో టాప్ స్పీడ్ 25 కిలోమీటర్లు కాగా, ఒక్కసారి చార్జింగ్ పెడితే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. 1.8 కిలోవాట్ల బ్యాటరీని దీంట్లో ఏర్పాటు చేశారు. ఈప్లూటో7జీ వెర్షన్లో 60 కిలోమీటర్ల స్పీడ్ వరకు వెళ్లొచ్చు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 90 నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ఇందులో 2.5 కిలోవాట్ల పేటెంటెడ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఎకో మోడ్లో అయితే 120 కిలోమీటర్లు, ఐసీఏటీ మోడల్లో 116 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడల్లో 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చట. కేవలం 5 సెకన్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కార్యక్రమంలో ఐఐటీ హైచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి, ప్యూర్ ఎనర్జీ సీఈవో రోహిత్ వడేర, ప్యూర్ఈవీ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిశాంత్ డొంగరి పాల్గొన్నారు.