యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (సెర్న్)లో 400 మంది ఇండియన్లు పనిచేస్తున్నారట. 111 దేశాలకు చెందిన 18 వేల మంది సైంటిస్టుల్లో మనోళ్ల వాటా 2.2 శాతమట. శుక్రవారం ఇండియా వచ్చిన సెర్న్ డైరెక్టర్ జనరల్ ఫాబియోలా గియనొట్టి చెప్పిన మాటిది. బెంగళూరులో విజ్ఞాన్ సంఘం కార్యక్రమం కోసం ఆమె వచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్, నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ మ్యూజియం కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. సెర్న్ ఏడాది బడ్జెట్ రూ.86 వేల కోట్లని, ఇందులో ఇండియా 2017లో 1.1 శాతం ఇచ్చిందని ఆమె తెలిపారు.
కంప్యూటింగ్, పవర్ సప్లై సిస్టమ్, హైటెక్ కాంపోనెంట్స్, హై ప్రిసెషన్ మెకానిక్స్లలో సెర్న్కు ఇండియా సాయం చేస్తోందన్నారు. ఏటా సుమారు వెయ్యి మంది టీచర్లు తమ సంస్థ సౌకర్యాలు, నైపుణ్యాన్ని వాడుకుంటున్నారన్నారు. 1995లో సెర్న్లో తాను చేరినపుడు 8 శాతం మందే మహిళలున్నారని, ఇప్పుడున్న 18 వేల మందిలో 20 శాతం మంది ఉన్నారని చెప్పారు. ఆడవాళ్ల సంఖ్య ఇంకా పెరగాలన్నారు. జీతం, ప్రమోషన్లలో సమానత్వం కోసం కృషి చేస్తున్నామని.. అలాగే నర్సరీ, పిల్లలను ఆడించే క్రీచ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
