మరో 40 లక్షల ఉద్యోగాలు పోయే ప్రమాదం
ప్రభుత్వ సాయం కావాలంటున్న టూరిస్టు ట్యాక్సీ సెక్టార్
న్యూఢిల్లీ: లాక్డౌన్ దెబ్బతో 20 లక్షలకు పైగా ప్రైవేట్బస్, టూరిస్ట్ ట్యాక్సీ సెక్టార్లో ఉద్యోగాలు పోయాయని బస్, కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఓసీఐ) పేర్కొంది. కరోనా లాక్డౌన్ తమపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని, మరో 40 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పింది. దేశంలో 20 వేల ఆపరేటర్లను రిప్రెజెంట్ చేస్తున్నామని ఈ సంస్థ చెబుతోంది. ఈ ఆపరేటర్లకు చెందిన 15 లక్షల బస్సులు, మ్యాక్సీ క్యాబ్లు, 11 లక్షల టూరిస్ట్ ట్యాక్సీలు కోటి మందికి ఉపాధి కల్పిస్తున్నాయని బీఓసీఐ పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్రైవేట్ ఆపరేటర్లకు ప్రభుత్వం నుంచి సాయం కావాలని కోరుతోంది. లాక్డౌన్ టైమ్లో 95 శాతం వెహికల్స్ నడవలేదని బీఓసీఐ ప్రెసిడెంట్ ప్రసన్న పట్వర్ధన్ అన్నారు. బిజినెస్ జరగకపోవడంతో తమ ఉద్యోగులకు జీతాలను ఇవ్వడానికి కూడా ఈ ఆపరేటర్ల వద్ద డబ్బులు లేవని పేర్కొన్నారు. ‘ఈ కోటి మంది ఉద్యోగుల్లో ఇప్పటికే 15–20 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇంకో 30–40 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. ఆర్బీఐ ఇచ్చిన మారటోరియం పీరియడ్ అయిపోయాక ఈ సెక్టార్ ఇంకా తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పారు.
ట్యాక్స్లను రద్దు చేయండి
మోటర్ వెహికల్ ట్యాక్స్లను రద్దు చేయాలని పట్వర్ధన్ ప్రభుత్వాన్ని కోరారు. డీజిల్పై రాయితీ ఇవ్వాలని, ఇంటర్ సిటీ ట్రావెల్కు టోల్ ట్యాక్స్లను తొలగించాలని అన్నారు. గత మూడు నెలల నుంచి తమ వెహికల్స్ ఆగిపోయాయని, కనీసం మూడు నెలల వరకైనా వెహికల్ ఇన్సూరెన్స్లను పొడిగించాలని కోరారు. వీటి ధరలు ముందులా లేవని, విపరీతంగా పెరిగాయని చెప్పారు. బస్సులకు ఇన్సూరెన్స్ రూ. 50 వేల నుంచి 2 లక్షల వరకు ఉన్నాయని చెప్పారు. వెహికల్ లోన్స్పై వడ్డీలను రద్దు చేసేలా ప్రభుత్వం చూడాలని ఆయన పేర్కొన్నారు.