న్యూఢిల్లీ: మన ఎకానమీ నెమ్మదిస్తున్న నేపథ్యంలో ఉద్యోగాలపై పరిస్థితిపై చాలా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని ఆర్బీఐ నెలవారీ సర్వేలో వెల్లడయింది. సర్వేలో పాల్గొన్న వారిలో 52.5 శాతం మంది తమ ఉద్యోగ పరిస్థితి అధ్వానంగా మారిందని చెప్పారు. ఎప్పుడైనా ఉద్యోగం ఊడే ప్రమాదం ఉందని అన్నారు. ఆర్బీఐ 2012 నుంచి ఈ సర్వే చేస్తుండగా, ఇంతమంది ఉపాధి గురించి ఆందోళన ప్రకటించడం ఇదే తొలిసారి. రాబోయే సంవత్సరంలో పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని, తమకు ఉపాధి దూరం కావొచ్చని 33.4 శాతం మంది అన్నారు.
ముఖ్యాంశాలు
- దాదాపు 30.1 శాతం కుటుంబాలు అత్యవసరం కాని ఖర్చులను తగ్గించుకున్నట్టు చెప్పాయి. భవిష్యత్లో దీనిని తగ్గించుకుంటున్నామని మరో 26 శాతం కుటుంబాలు తెలిపాయి.
- అత్యవసరం కాని ఖర్చులను భవిష్యత్లో తగ్గించుకుంటామని సర్వేలో చాలా కుటుంబాలు చెప్పాయి. ఎకానమీకి ఈ పరిస్థితి మంచిది కాదు. ప్రజల ఖర్చు పెరిగితేనే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది.
- మన ఎకానమీ మరింత కుంగిపోతుందని 31.8 శాతం కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం లేదని కొందరు, వచ్చే ఏడాది తగ్గుతుందని మరికొందరు అన్నారు.