దగ్గు మందు వివాదంలో బిగ్ ట్విస్ట్.. కోల్డ్రిఫ్ దగ్గుమందు కంపెనీ ఓనర్ అరెస్టు

దగ్గు మందు వివాదంలో బిగ్ ట్విస్ట్.. కోల్డ్రిఫ్ దగ్గుమందు కంపెనీ ఓనర్ అరెస్టు

దేశ వ్యాప్తంగా 21 మంది చిన్నారుల మృతికి కారణం కోల్డ్రిఫ్ దగ్గు మందేనన్న ఆరోపణలతో.. ఆ మందును తయారు చేస్తున్న కంపెనీ ఓనర్ ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం (అక్టోబర్ 09) ఉదయం శ్రీసన్ ఫార్మాసూటికల్స్ ఓనర్ జి.రంగనాథన్ ను ఏడుగురు సభ్యుల పోలీసు బృందం అరెస్టు చేసింది. 

మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కోల్డ్ రిఫ్ సిరప్ వాడిన 21 మంది చిన్నారులు మృతి చెందారు. కోల్డ్ రిఫ్ సిరప్ వాడకంతోనే పిల్లలు చనిపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు కోల్డ్ రిఫ్ సిరప్లో 48.6 శాతం విషపూరితమైన డైఇథిలీన్ గ్లైకాల్ (డీఈజీ) ఉన్నట్లుగా ల్యాబ్ టెస్టులలో తేలింది. దీంతో గురువారం ఉదయం.. శ్రీసన్ ఫార్మా ఓనర్ జి.రంగనాథన్ ను విచారించిన మధ్య ప్రదేశ్ పోలీసులు.. ఆ వెంటనే అరెస్టు చేశారు. 

దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన దగ్గు మందు కోల్డ్ రిఫ్ సిరప్లో 48.6 శాతం విషపూరితమైన డైఇథిలీన్ గ్లైకాల్ (డీఈజీ)ను తమిళనాడు ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. తమిళనాడు ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ కాంచీపురంలోని శ్రేసన్ ఫార్మా తయారీ యూనిట్లోని కోల్డ్‌‌‌‌రిఫ్ కాఫ్ సిరప్ నమూనాలను పరీక్షించింది. ఈ నమూనాల్లో అనుమతించిన స్థాయికి మించి డీఈజీ ఉందని మినిస్ట్రీ పేర్కొంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం దగ్గు మందు అమ్మకాలను నిషేధించింది. డైథిలిన్ గ్లైకాల్ విషపూరితమైనది. డైథిలిన్ గ్లైకాల్ మానవ శరీరంలో విషంగా పనిచేస్తుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. గుండె, మూత్రపిండాలు పనితీరుపై ప్రభావం చూపుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్కు కారణమవుతుంది.

తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ప్రజలకు ఇప్పటికే ఈ దగ్గు మందుపై కీలక హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. అనుమానిత కోల్డ్రిఫ్ సిరప్ బ్యాచ్ నెంబర్ ఎస్ఆర్ 13 వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో దగ్గు మందు సేవించిన చిన్నారులు మరణించారని వార్తలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 

తమిళనాడులోని కంచిపురం జిల్లా సుంగువార్చతిరానికి చెందిన శ్రీసన్ ఫార్మా తయారు చేసిన కోల్డ్రిఫ్ సిరప్ (పారాసెటమాల్, ఫెనిలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్, క్లోర్‌‌‌‌ఫెనిరమైన్ మలేట్ కాంబినేషన్) బ్యాచ్ నెంబర్ ఎస్ఆర్13, మాన్యుఫ్యాక్చరింగ్ తేదీ మే 2025, ఎక్స్పైరీ తేదీ ఏప్రిల్ 2027 విషపూరితమైన డైఇథిలీన్ గ్లైకాల్ (డీఈజీ)తో కలుషితమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ సిరఫ్‌ను వాడొద్దని డీసీఏ స్పష్టం చేసింది. ఈ బ్యాచ్ నెంబర్ గల సిరప్ ప్రజలు, డీలర్లు, మెడికల్ షాపుల్లో ఉన్నా వెంటనే డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని డీసీఏ కోరింది. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 కు సమాచారం అందించవచ్చని పేర్కొంది.