ప్రేమ గుడ్డిది అంటారు.. ఆ పాక్ అమ్మాయి ప్రేమ కోసం ఏకంగా బార్డర్ ను దాటొచ్చింది. హైదరాబాద్ లో ఉన్న తన లవర్ కోసం ఇంటిని వదిలిపెట్టి.. ఇంతపెద్ద సాహసం చేసింది. పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ కు చెందిన కలీజా నూర్, మన హైదరాబాద్ కు చెందిన అహ్మద్ సోషల్ మీడియా వేదికగా ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ల పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని సోషల్ మీడియా వేదికగా డిసైడ్ అయ్యారు. వీడియో కాల్స్ లో దీని గురించి పదేపదే మాట్లాడుకున్నారు. తాను ఇండియాకు వచ్చి కలుస్తానని అహ్మద్ కు కలీజా నూర్ చెప్పింది.
ప్రియుడు అహ్మద్.. తన ప్రియురాలు కలీజాకు నకిలీ ఆధార్ కార్డును సృష్టించాడు. పాకిస్థాన్ నుంచి నేరుగా దుబాయ్ కి వెళ్లిన కలీజా.. అక్కడి నుంచి నేపాల్ కు చేరుకుంది. అహ్మద్ తన స్నేహితుడి సహాయంతో కలీజాను నేపాల్ నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు.
భారత్, నేపాల్ సరిహద్దుల్లో బీహార్ లోని సుర్సంద్ దగ్గర భారత సైన్యానికి కలీజా దొరికిపోయింది. నకిలీ ఆధార్ కార్డుతో ఆమె ఇండియాలోకి ప్రవేశించేందుకు యత్నించిందని గుర్తించారు. కలీజా అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించేందుకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా సైనికులు పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు దర్యాప్తు చేయగా.. కలీజా, అహ్మద్ ల ప్రేమ బాగోతం బయటపడింది. కలీజా తన పేరెంట్స్ కు ప్రేమ గురించి చెప్పగా.. వాళ్లు హైదరాబాద్ కు చెందిన అహ్మద్ తో పెళ్లి చేసేందుకు నిరాకరించారు. ఈ కారణం వల్లే తాను ఇంటి నుంచి పారిపోయి ఇండియాకు వచ్చినట్లు దర్యాప్తులో పోలీసులకు కలీజా వివరించింది.