IND vs PAK: గెలవాలంటే బౌలర్లదే భారం.. పాక్‪పై బ్యాటింగ్‪లో నిరాశపరిచిన టీమిండియా

IND vs PAK: గెలవాలంటే బౌలర్లదే భారం.. పాక్‪పై బ్యాటింగ్‪లో నిరాశపరిచిన టీమిండియా

అండర్-19 ఆసియా కప్ లో టీమిండియా ప్రత్యర్థి పాకిస్థాన్ పై బ్యాటింగ్ లో విఫలమైంది. పాకిస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. ఆదివారం (డిసెంబర్ 14) దుబాయ్ వేదికగా ఐసీసీ అకాడమీ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత జట్టు 46.1 ఓవర్లలోనే 240 పరుగులకు ఆలౌటైంది. ఆరోన్ జార్జ్ 85 పరుగులు చేసి జట్టుకు ఒక మాదిరి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కనిష్క్ చౌహాన్ (46), ఆయుష్ మాత్రే (38) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో మొహమ్మద్ సయ్యం, అబ్దుల్ సుభాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. నిఖాబ్ షఫీక్ రెండు.. అలీ రజా,అహ్మద్ హుస్సేన్ లకు ఒక్కో వికెట్ దక్కింది. 

వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ కు దిగింది. ఆరంభంలోనే టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్ లో ఉన్న వైభవ్ సూర్యవంశీ కేవలం 5 పరుగులకే చేసి ఔటయ్యాడు. ఈ దశలో కెప్టెన్ ఆయుష్ మాత్రే, ఆరోన్ జార్జ్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్ కు 49 పరుగులు జోడించిన తర్వాత భారత జట్టు మాత్రే వికెట్ ను కోల్పోయింది. ఈ రెండు వికెట్లు మొహమ్మద్ సయ్యంకే దక్కాయి. కాసేపటికే విహాన్ మల్హోత్రా (12), వేదాంత్ త్రివేది (7) పెవిలియన్ బాట పట్టడంతో భారత జట్టు 113 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

ఈ దశలో అభిజ్ఞాన్ కుండుతో కలిసి జార్జ్ జట్టును ఆదుకున్నాడు. ఐదో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ముందుకు తీసుకెళ్లాడు. అభిజ్ఞాన్ కుండు (22) తో పాటు 85 పరుగులు చేసి క్రీజ్ లో పాతుకుపోయిన జోర్జి స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది. ఒక వైపు వికెట్ల పడుతున్నా మరో ఎండ్ లో కనిష్క్ చౌహాన్ జట్టుకు విలువైన పరుగులు అందించాడు. కీలకమైన 46 పరుగులు చేసి జట్టు స్కోర్ ను 240 పరుగులకు చేర్చాడు. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే తమ తొలి మ్యాచ్ లో  యూఏఈపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.