ఇస్లామాబాద్: పాక్ చెంప ఛెళ్లుమనేలా భారత వాయుసేన దెబ్బ కొట్టింది. తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఆ దేశ భూభాగంలో మన యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించి.. ముష్కర స్థావరాలను మట్టుబెట్టాయి. జైషే మహమ్మద్ ట్రైనింగ్ క్యాంపులను భూస్థాపితం చేశాయి.
భారత వాయుసేన దాయాది దేశంపై చేసిన ప్రతీకార దాడిని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ ధ్రువీకరించారు. నియంత్రణ రేఖ దాటి వచ్చి భారత వాయుసేన దాడి చేసిందని అన్నారు. ఈ దాడిపై పాక్ రాజకీయ నాయకత్వం నుంచి వచ్చిన తొలి స్పందన ఇది.
ముందే ఊహించాం
భారత్ ఇటువంటి దాడి ఏదో చేస్తుందని తాము ముందే ఊహించామని, ఈ విషయాన్ని ప్రపంచానికి కూడా చెబుతూ వచ్చామని ఖురేషీ అన్నారు. ఈ రోజు భారత్ చేసిన పనితో నియంత్రణ రేఖ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని చెప్పారు. భారత వాయుసేన చేసిన దాడితో తమకు ప్రతీకార దాడి చేసే హక్కు వచ్చిందన్నారు.
ఇమ్రాన్ అత్యవసర భేటీ
నియంత్రణ రేఖ దాటి మన వాయుసైన దాడి చేయడంతో పాక్ ఉలిక్కి పడింది. నెత్తిన బాంబులు వేయడంతో ఇప్పుడు ఏం చేయాలన్న దానిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన కేబినెట్ ను అత్యవసర భేటీకి పిలిచారు. భారత వాయుసేన దాడితో జరిగిన నష్టంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
