మా సైన్యం మేల్కొనేలోపే భారత ఆర్మీ దాడి చేసింది : షెహబాజ్ షరీఫ్​

మా సైన్యం మేల్కొనేలోపే భారత ఆర్మీ దాడి చేసింది : షెహబాజ్  షరీఫ్​

న్యూఢిల్లీ: తమ సైన్యం మేల్కొనేలోపే భారత ఆర్మీ తమపై అటాక్ చేసిందని పాకిస్తాన్  ప్రధాని షెహబాజ్  షరీఫ్​ తెలిపారు. కీలకమైన ఆర్మీ స్థావరాలపై బ్రహ్మోస్  క్షిపణులతో భారత బలగాలు దాడులు చేశాయని ఆయన ఒప్పుకున్నారు. అజర్ బైజాన్ పర్యటనలో ఉన్న షరీఫ్​ గురువారం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. భారత బలగాల దాడులను తిప్పికొట్టాలనుకున్నామని, ఈ నెల 9న రాత్రి ప్రణాళిక రచించుకున్నామని చెప్పారు. 10వ తేదీ తెల్లవారుజామున ప్రార్థనలు చేసిన వెంటనే 4.30 గంటలకు దాడులు చేసేందుకు తమ ఆర్మీ సిద్ధమైందని వెల్లడించారు.

 కానీ, అంతలోనే (మే 9వ తేదీ అర్ధరాత్రి) భారత బలగాలు బ్రహ్మోస్  క్షిపణులతో తమ దేశంలోని వివిధ ప్రావిన్సులపై  విరుచుకుపడ్డాయని వివరించారు. రావల్పిండి ఎయిర్ పోర్టుతో పాటు చాలా కీలక ప్రాంతాలపై భారత బలగాలు అటాక్  చేశాయని వెల్లడించారు. ఆ దాడుల్లో చాలా కీలక స్థావరాలు ధ్వంసం అయ్యాయని తెలిపారు. భారత్  దూకుడు వైఖరితో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయని ఆరోపించారు. ఇండియా దాడి చేస్తే, తాము కూడా అంతే దీటుగా ప్రతిదాడులు చేస్తామన్నారు. ఎందుకంటే, తమ దేశాన్ని రక్షించుకోవడం తప్ప తమకు వేరే మార్గం లేదని షరీఫ్  పేర్కొన్నారు. ఇక కాల్పుల విరమణకు తమ ఆర్మీ చీఫ్​ సలహా ఇచ్చారని, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేందుకే కాల్పుల విరమణకు తాము ముందుకు వచ్చామని చెప్పారు.

ఇప్పుడు నా పేరు ఫేమస్  అయింది: పహల్గాం సూత్రధారి

పహల్గాం టెర్రర్  అటాక్  వెనుక ఉన్నది తానే అని తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన పేరు ఫేమస్  అయిందని లష్కరే తాయిబా కమాండర్  సైఫుల్లా కసూరి అన్నాడు. గురువారం పంజాబ్ లోని కసూర్ లో నిర్వహించిన ఓ ర్యాలీలో అతను ఈ వ్యాఖ్యలు చేశాడు.