
- ఈ సెగ్మెంట్ పై అన్ని పార్టీల నేతల దృష్టి
- ఇప్పటికే కర్చీఫ్ వేసుకున్నామంటున్న కామ్రేడ్లు
- ఏర్పాట్లు చేసుకుంటున్న సీపీఎం నేత తమ్మినేని
- పోటీకి సిద్ధమవుతున్న షర్మిల, పొంగులేటి
- ఆ టికెట్ కోసమే పట్టుబడుతున్న మాజీ మంత్రి తుమ్మల
- సిట్టింగులకే సీట్ల కోటాలో తనకేనన్న కందాల
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. ఈ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీల నేతలు ఉత్సాహం చూపుతున్నారు. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈ స్థానం నుంచే పోటీకి రెడీ అవుతున్నారు. మరో వైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా ఇక్కడి నుంచే ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు సంకేతాలిచ్చారు. సీఎం కేసీఆర్ నుంచి తనకు హామీ లభించిందని, పని చేసుకోవాలని చెప్పారని పేర్కొంటున్నారు. వామపక్షాలకు ఇచ్చే సీట్లపై ఇప్పుడే ప్రకటిస్తే చిక్కులు వస్తాయని కేసీఆర్ తమతో చెప్పారని అంటున్నారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సారి అసెంబ్లీ మెట్లెక్కాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా ఈ సెగ్మెంట్ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండటం, తన అనుచరగణం ఉండటం కలిసొస్తుందని పొంగులేటి భావిస్తున్నారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఉపేందర్ రెడ్డి పాలేరు లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొంది.. బీఆర్ఎస్ లోకి మారారు. అయితే సీఎం కేసీఆర్ ఇదివరకే సిట్టింగులకు సీట్లు కేటాయించినట్టు ప్రకటించిన నేపథ్యంలో తనకే టికెట్ వస్తుందనే ధీమాలో ఆయన ఉన్నారు.
2018 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రెడీ అవుతున్నారు. పాలేరు టికెట్ తనకే కేటాయించాలని సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావును కోరినట్టు సమాచారం. ఈ సెగ్మెంట్ లో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ బలంగా పనిచేస్తుందని, వైఎస్సార్ పథకాలతో లబ్ధి పొందిన ఎస్సీ, ఎస్టీలు చాలా ఉన్నారని షర్మిల నమ్ముతున్నారు. అందుకే అక్కడ పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పట్టుంది. అయితే వైఎస్ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న పొంగులేటి షర్మిలపై పోటీ చేస్తారా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది. పొంగులేటి పాలేరు నుంచి పోటీ చేస్తే షర్మిల ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనే చర్చ మొదలైంది. పాలేరు సెగ్మెంట్ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ సీటుగా మారనుంది.
ఉమ్మడి జిల్లాలో మూడే జనరల్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు మాత్రమే జనరల్ స్థానాలు. ముఖ్యనాయకులెవరు పోటీ చేసినా ఈ మూడు సెగ్మెంట్లనే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ సెగ్మెంట్లో ఎస్టీ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు గెలుపోటములను నిర్ణయిస్తాయి.