పాలమూరు జిల్లాలో జోరుగా నామినేషన్లు

పాలమూరు జిల్లాలో జోరుగా నామినేషన్లు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో బుధవారం కాంగ్రెస్​, బీఆర్ఎస్​, బీజేపీ, బీఎస్పీలతో పాటు ఇండిపెండెంట్​ అభ్యర్థులు  భారీగా నామినేషన్లు దాఖలు చేశారు.  మొత్తం 44 నామినేషన్లు దాఖలయ్యాయి.  మహబూబ్​ నగర్​ జిల్లాలో 9 ,  నాగర్​ కర్నూల్​ జిల్లాలో  22 ,  వనపర్తి జిల్లాలో 3 , గద్వాల జిల్లాలో  7 ,  నారాయణపేట జిల్లాలో  3 నామినేషన్లు పడ్డాయి. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది. నామినేషన్​ సందర్భంగా  అచ్చంపేటలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది.బీఆర్​ఎస్​కు చెందిన వారిని నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మందిని అనుమతించారని కాంగ్రెస్​ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 

 గద్వాల, వెలుగు :  గద్వాల జిల్లాలో బుధవారం 7 నామినేషన్లు దాఖలయ్యాయి. అలంపూర్ లో 5, గద్వాలలో 2 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు అపూర్వ్ చౌహాన్, చంద్రకళ తెలిపారు. గద్వాలలో కాంగ్రెస్ తరఫున సరిత, బీఎస్పీ తరఫున పరమాల కృష్ణ బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. అలంపూర్ నుంచి కాంగ్రెస్  తరఫున సంపత్ కుమార్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను బీఫామ్ తో పాటు దాఖలు చేశారు.  ధర్మ సమాజ్ పార్టీ నుంచి లక్ష్మన్న, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ప్రసంగి, బీజేపీ నుంచి మాదన్న  నామినేషన్ దాఖలు చేశారు. 

వనపర్తిలో  మేఘా రెడ్డి నామినేషన్

వనపర్తి, వెలుగు :  జిల్లాలో 3 నామినేషన్లు దాఖలు చేశారు. .  వనపర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తుడి మేఘా రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.  ఇండిపెండెంట్ అభ్యర్థిగా మంచిర్యాల జిల్లాకు చెందిన గండి వెంకటరమణ మరో నామినేషన్ సమర్పించారు.  బంకల ఎల్లయ్య  ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు.

నారాయణ పేట జిల్లాలో  3 

నారాయణపేట, వెలుగు :  నారాయణపేటలో బుధవారం 3 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి చిట్టెం పర్ణిక, బీజేపీ నుంచి రతంగ్​ పాండురెడ్డి, బీఎస్పీ నుంచి బొదిగెల శ్రీనివాస్​ నామినేషన్​ పత్రాలను ఆర్​ఓకు అందించారు.  

నాగర్​ కర్నూల్ జిల్లాలో  22 నామినేషన్లు

నాగర్​ కర్నూల్​, వెలుగు :  జిల్లాలో  22  నామినేషన్లు పడ్డాయి. నాగర్​ కర్నూల్​ నుంచి 9, అచ్చంపేట నుంచి 5, కల్వకుర్తిలో 3,  కొల్లపూర్​లో 5 నామినేషన్లు పడ్డాయి. నాగర్​ కర్నూల్​లో బీఆర్ఎస్​ అభ్యర్థి మర్రి జనార్దన్​ రెడ్డి నామినేషన్​ దాఖలు చేశారు. ఉమామహేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మాజీ మంత్రి డా.నాగం జనార్దన్​ రెడ్డి, డీసీసీసీబీ డైరెక్టర్​ జక్కా రఘునందన్​ రెడ్డితో కలిసి నామినేషన్లు  దాఖలు చేశారు.  మర్రి జనార్దన్​ రెడ్డి భార్య మర్రి జమునా రాణి బీఆర్ఎస్​నుంచి నామినేషన్​ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి  డా.కూచుకుల్ల రాజేశ్​ రెడ్డి తరపున ఆయన తండ్రి ఎమ్మెల్సీ  కూచుకుల్ల దామోదర్ రెడ్డి నామినేషన్​ చేశారు.

ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా మిద్దె రాములు, భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (మార్కిస్ట్ లెనినిస్ట్) పార్టీ నుంచి  కడుకుంట్ల జానకి రాంరెడ్డి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి  జాడి స్వామి, ఇండిపెండెంట్​ అభ్యర్థులుగా నరిగే నరేందర్,  మూడవత్ బాలరాజు, చీమర్ల రాజేశ్వర్ రెడ్డి నామినేషన్​ దాఖలు చేశారు.అచ్చంపేటలో బీఆర్​ఎస్​ అభ్యర్థి గువ్వల బాలరాజు, కాంగ్రెస్​ అభ్యర్థి డా.చిక్కుడు వంశీకృష్ణ, బీజేపీ నుంచి దేవని సతీశ్​ మాదిగ, బీఎస్సీ నుంచి మోతుకురి నాగార్జున, ధర్మ సమాజ్​ పార్టీ నుంచి చింత సాయిబాబు నామినేషన్లు వేశారు. కల్వకుర్తిలో  బీఆర్ఎస్​ అభ్యర్థి గుర్కా జైపాల్​ యాదవ్ నామినేషన్​ దాఖలు చేశారు. ఇండియన్​ ప్రజాబంధు పార్టీ నుంచి అమర్​నాథ్​, ఇండిపెండెంట్ గా  రేఖ్యా నాయక్​  నామినేషన్​ వేశారు. 

కొల్లాపూర్​లో ధర్మసమాజ్​ పార్టీ నుంచి ఆది సంధ్యారాణి, బీఎస్పీ  నుంచి గగనం శేఖరయ్య ,  ప్రజాపార్టీ నుంచి బింగి సాయిలు , ఇండిపెండెంట్​గా కర్నే శిరీష, భారత చైతన్య యువజన పార్టీ నుంచి తిరుపతమ్మ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల సందర్బంగా ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు గుమిగూడకుండా నియంత్రించడానికి పోలీసులు నానాపాట్లు పడ్డారు. 

 పాలమూరు జిల్లాలో  9   

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : జిల్లాలో  9 మంది నామినేషన్లు వేశారు. మహబూబ్ నగర్  నంచి 5 మంది, జడ్చర్ల నుంచి3, దేవరకద్ర నుంచి1 నామినేషన్​ పడ్డాయి. మహబూబ్ నగర్  స్థానానికి 5 మంది  బుధవారం రిటర్నింగ్ అధికారి అనిల్ కుమార్ కు నామినేషన్లు అందించారు. బీజేపీ క్యాండిడేట్​ ఏపీ మిథున్​రెడ్డి రెండు సెట్ల నామినేషన్​ దాఖలు చేయగా, బీఎస్పీ క్యాండిడేట్​ పి.స్వప్న రెండు సెట్ల నామినేషన్​, ఇండిపెండెంట్​అభ్యర్థిగా ఎం.శ్రీనివాసులు రెండు సెట్ల నామినేషన్​లు, మల్కాపురం శ్రీనివాస్​ గౌడ్​ ఇండిపెండెంట్​ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్​లు దాఖలు చేశారు. కాంగ్రెస్​అభ్యర్థి యెన్నం శ్రీనివాస్​రెడ్డి ఒక సెట్​ నామినేషన్ వేశారు. 

జడ్చర్ల నుంచి కాంగ్రెస్​ క్యాండిడేట్ జనంపల్లి అనిరుధ్​రెడ్డి రెండు సెట్ల నామినేషన్, ఇమ్మడి ఆనంద్​, వెలిజాల బసవయ్య ఒక సెట్​ నామినేషన్​లు దాఖలు చేశారు. దేవరకద్ర నుంచి కాంగ్రెస్​  అభ్యర్థిగా  మధుసూదన్​రెడ్డి (జీఎంఆర్​) నామినేషన్​ దాఖలు చేశారు. కాగా, బీజేపీ క్యాండిడేట్​ ఏపీ మిథున్​రెడ్డి నామినేషన్​ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి దాదాపు 20 వేల మంది పబ్లిక్​ అటెండ్​ అయ్యారు. అలాగే యూనియన్​ మినిష్టర్​ వీకే సింగ్​ చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. ఆయన వెంట మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి పాల్గొన్నారు.