దేవరకొండలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

దేవరకొండలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
  • 30 గంజాయి మొక్కలు స్వాధీనం 

దేవరకొండ(పీఏపల్లి), వెలుగు : గంజాయి సాగు చేస్తున్న వ్యక్తులను పీఏపల్లి పోలీసులు అరెస్టు చేశారు. గురువారం దేవరకొండ డివిజన్ పీఏపల్లి మండలం గుడిపల్లి పోలీస్ స్టేషన్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఏస్పీ మౌనిక నిందితుల వివరాలను వెల్లడించారు. పీఏపల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన నాగిళ్ల పాండురంగయ్య భూమిని కొండమల్లేపల్లికి చెందిన డేరింగ్ల సింగారావు, పీఏపల్లి మండలం పిల్లిగుండ్ల తండాకు చెందిన ఇస్లావత్ చంద్రు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. గతంలో సింగారావు పండ్ల వ్యాపారం చేస్తున్నప్పుడు నాంపల్లి మండలం బండతిమ్మాపురం గ్రామానికి కొత్త గొల్ల శ్రీనుతో పరిచయం ఏర్పడింది. అతడు కొన్ని గంజాయి విత్తనాలను సింగారావుకు ఇచ్చి మొక్కలు పెంచితే డబ్బులు ఇస్తానని చెప్పాడు.

 సింగారావు మూడు గంజాయి మొక్కలు పెంచి శ్రీనుకు ఇవ్వడంతో రూ.5 వేలు ఇచ్చాడు. సింగారావు, చంద్రు కలిసి 30 గంజాయి మొక్కలు పెంచి నాంపల్లి మండలం రేవల్లి గ్రామానికి చెందిన శివకు చూపించారు. ఆ గంజాయి మొక్కలను శివ తీసుకొని అతడి దగ్గరకు వచ్చే వ్యక్తులకు అమ్మి డబ్బులు సంపాదించాలని ప్లాన్​వేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి ఆ నలుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి రూ.3 లక్షల విలువైన 30 గంజాయి మొక్కలు, బైక్​, నాలుగు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కేసును చేధించిన ఏఎస్పీ మౌనిక, సీఐ రాజు, ఎస్ఐలు నరసింహులు, రమేశ్, సిబ్బందిని ఎస్పీ శరత్​చంద్ర పవార్​ 
అభినందించారు.