తాను చనిపోతూ.. ఏడుగురికి పునర్జన్మ

తాను చనిపోతూ.. ఏడుగురికి పునర్జన్మ
  • కబడ్డీ ఆడుతూ గాయపడ్డ స్టూడెంట్
  • బ్రెయిన్‌‌ డెడ్‌‌ అయిందన్న డాక్టర్లు
  • ఏడుగురికి అవయవ దానం

హైదరాబాద్, వెలుగు: పుట్టెడు దు:ఖంలోనూ ఆ తల్లిదండ్రులు చూపిన ఔదార్యం ఏడుగురికి పునర్జన్మనిచ్చింది. బ్రెయిన్ డెడ్ అయిన తమ కొడుకు ఆర్గాన్స్ ను దానం చేసి వారు ఆదర్శంగా నిలిచారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన ఊడుగుల ఐలయ్య కొడుకు సంతోష్(16) హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం జయగిరిలో బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఈ నెల 8న కాలేజీలో కబడ్డీ ఆడుతుండగా ప్రమాదవశాత్తు సంతోష్‌‌ గాయపడ్డాడు. వెంటనే ఎంజీఎం హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మెదడులో రక్తం గడ్డ కట్టిందని, హైదరాబాద్ కు తీసుకెళ్లాలని చెప్పడంతో కిమ్స్ కు తరలించారు. మూడు రోజులు చికిత్స చేసినప్పటికీ.. ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలోనే సంతోష్ బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు కుటుంబ సభ్యులకు చెప్పారు.

విషయం తెలుసుకున్న జీవన్‌‌ దాన్‌‌ సంస్థ సభ్యులు అవయవదానం ప్రాముఖ్యాన్ని తల్లిదండ్రులకు వివరించగా.. పుట్టెడు దు:ఖంలో ఉన్నప్పటికీ వారు ఆర్గాన్ డొనేషన్ కు ముందుకొచ్చారు. డాక్టర్లు సంతోష్ అవయవాలు సేకరించి ఏడుగురికి అమర్చారు. సంతోష్ లంగ్స్ తో కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు దేశంలోనే తొలిసారిగా బ్రీతింగ్ లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేశారు. ఏడుగురికి ప్రాణదానం చేసిన సంతోష్ సంస్మరణ సభను ఆయన స్వగ్రామం పెద్దముప్పారంలో కుటుంబ సభ్యులు, ప్రగళ్లపాటి ఫౌండేషన్ బాధ్యులు మంగళవారం నిర్వహిస్తున్నారు.