బిజినెస్ డెస్క్, వెలుగు: పేటీఎం షేర్లు తమ మొదటి రోజు ఇన్వెస్టర్లకు ఫ్లాప్ షో చూపించాయి. కంపెనీ షేర్లు గురువారం సెషన్లో ఐపీఓ ధర కంటే 9 శాతం నష్టంతో లిస్టింగ్ అయ్యాయి. ఇంట్రాడేలో 27 శాతం వరకు నష్టపోయి క్లోజయ్యాయి. పేటీఎం షేరు ధర ఐపీఓలో రూ. 2,150 కాగా, ఎన్ఎస్ఈలో రూ. 1,950 వద్ద కంపెనీ షేర్లు లిస్ట్ అయ్యాయి. అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో ఇంట్రాడేలో రూ. 1,560 వరకు పడి క్లోజయ్యాయి. కేవలం కొన్ని నిమిషాల్లోనే పేటీఎం ఇన్వెస్టర్ల సంపద రూ. 35 వేల కోట్లు తగ్గింది. ఐపీఓ రేటు ప్రకారం పేటీఎం మార్కెట్ క్యాప్ రూ. 1.39 లక్షల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం ఈ మార్కెట్ క్యాప్ రూ. 1.04 లక్షల కోట్లకు తగ్గింది. ‘ప్రస్తుత రేటు నుంచి మరో 50 శాతం పడినా కూడా పేటీఎం షేర్లను కొనడానికి ముందుకు రాను. మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కంపెనీ కోల్పోతోంది’ అని ఆన్సిద్ క్యాపిటల్ ఎనలిస్ట్ అనురాగ్ సింగ్ పేర్కొన్నారు. పేటీఎం వాల్యుయేషన్ 20 బిలియన్ డాలర్లంటే దానర్ధం కంపెనీ యాక్సిస్ బ్యాంక్ విలువలో 60 శాతానికి, కోటక్ బ్యాంక్లో 40 శాతానికి, ఐసీఐసీఐ బ్యాంక్లో 30 శాతానికి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో 20 శాతానికి సమానమని..కానీ, తాను అది నమ్మడం లేదని చెప్పారు. ‘ఏడెనిమిదేళ్ల నుంచి బిజినెస్లో ఉన్నా, కంపెనీ బ్రోకరేజి సెగ్మెంట్లో విస్తరించలేకపోయింది. బ్యాంకింగ్ సెగ్మెంట్లో పెద్దగా లేదు. పేమెంట్ బ్యాంక్స్లో యావరేజ్ అకౌంట్ బ్యాలెన్స్ రూ. 500 కూడా ఉండదు. దీంతో ఏం చేయగలరు? లెండింగ్ స్పేస్లో కూడా కంపెనీ పెద్దగా విస్తరించలేదు’ అని సింగ్ వివరించారు.
గొప్ప కంపెనీనే కానీ..
పేటీఎం గొప్ప కంపెనీనే కానీ రాంగ్ కంట్రీలో ఉందని గ్రీన్ఎడ్జ్ వెల్త్ పార్టనర్ దిగంటి హారియా అన్నారు. యాక్సిస్ బ్యాంక్ వాల్యుయేషన్కు ధీటుగా కంపెనీ వాల్యుయేషన్ ఉందని అన్నారు. కానీ, యాక్సిస్ బ్యాంక్ ప్రాఫిటే రూ. 10 వేల కోట్లుగా ఉంటే, పేటీఎం రెవెన్యూ రూ. 3 వేల కోట్లుగా ఉందని చెప్పారు. ‘వాలెట్గా పేటీఎం స్టార్టయ్యింది. యూపీఐ వచ్చాక వాలెట్ల వాడకం పడిపోయింది. ఆ తర్వాత పేటీఎం మాల్ లేదా ఇతర ఈ–కామర్స్ బిజినెస్లోకి కంపెనీ ఎంటర్ అయ్యింది. కానీ, దేశంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ల దెబ్బకు పేటీఎం మాల్ సక్సెస్ కాలేదు. బ్రోకింగ్ , మ్యూచువల్ ఫండ్ బిజినెస్లోకి కూడా కంపెనీ ఎంటర్ అయ్యింది. కానీ, ఈ సెగ్మెంట్లో ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. రూ. 15–16 వేల కోట్ల రెవెన్యూని సంపాదించడానికి గత కొన్నేళ్లలో రూ. 14 వేల కోట్లను కంపెనీ ఖర్చు చేసింది. ఇలాంటి స్థితిలో ప్రస్తుత బ్యాంకింగ్ సెగ్మెంట్ స్థితిగతులను కంపెనీ మారుస్తుందని అనుకోవడం లేదు. ఒకప్పుడు ప్రైవేట్ బ్యాంకులు చేసినట్టు బ్యాంకింగ్ సెగ్మెంట్ను మార్చడం పేటీఎంకు చాలా కష్టం’ అని హారియా అభిప్రాయపడ్డారు. పేమెంట్స్ కూడా ఫ్రీ కాబట్టి కంపెనీ ప్లాట్ఫామ్ను వాడుతున్నారని అన్నారు. ‘నాకు ఫుడ్ తినాలనిపిస్తే జొమాటో లేదా స్విగ్గీ గుర్తొస్తుంది. ట్రావెల్ చేయాలంటే ఐఆర్సీటీసీ లేదా మేక్మైట్రిప్, ట్రేడ్ చేయాలంటే జెరోధా లేదా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ గుర్తొస్తుంది. అలా పేటీఎం ఎదగలేదు. కంపెనీకి అన్ని సెగ్మెంట్లలో గట్టి పోటీ ఉంది’ అని చెప్పారు.
ఎమోషనల్ అయిన విజయ్ శేఖర్ శర్మ..
పేటీఎం లిస్టింగ్ జరుగుతున్నప్పడు కంపెనీ ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ ఎమోషనల్ అయ్యారు. తాను ఒక స్కూల్ టీచర్ కొడుకునని, రాక్ మ్యూజిక్ను వినడం ద్వారా ఇంగ్లిస్ నేర్చుకున్నానని చెప్పారు. పేటీఎం స్టోరీ వందల మంది ఎంటర్ప్రెనూర్లను ఇన్స్పైర్ చేస్తోందని అన్నారు. వారు కూడా చేయగలమనే నమ్మకం ఇచ్చిందన్నారు. కాగా, పేటీఎంలో శేఖర్ శర్మకు 14 శాతం వాటా ఉంది. ఐపీఓ వాల్యుయేషన్ను బట్టి చూస్తే ఆయన సంపద 2.8 బిలియన్ డాలర్లకు సమానం. కంపెనీ షేర్లు పడ్డాయి కాబట్టి ఆయన సంపద 500 మిలియన్ డాలర్లు తగ్గింది.