- పోలీస్స్టేషన్లో పీడీఎస్ అక్రమ రవాణాదారుల నిరసన
బెల్లంపల్లి, వెలుగు : పోలీసులకు పైసలు ఇస్తున్నా తమ వాహనాలను ఎందుకు పట్టుకుంటున్నారంటూ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాదారులు ఆదివారం తాండూరు పీఎస్లో ఆందోళనకు దిగారు. ప్యాసింజర్ ఆటోలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని సమాచారంతో శనివారం రాత్రి తాండూర్ ఎస్సై జగదీశ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి చేసి బియ్యాన్ని పట్టుకున్నారు.
అయితే శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసులకు సమాచారం ఇస్తున్నారంటూ బెల్లంపల్లికి చెందిన, రేషన్ బియ్యం అక్రమ రవాణాదారులైన ఫరీనా బేగం, అమీనా బేగం, టీనా బేగం, మోసిన్, అన్వర్, మగ్దూమ్లతో పాటు మరో మహిళ కలిసి శ్రీనివాస్పై దాడికి యత్నించారు. దీంతో అతడు వారి నుంచి తప్పించుకొని తాండూర్ పీఎస్కు చేరుకొని, పోలీసులకు చెప్పాడు.
అక్రమ రవాణాదారులు సైతం పోలీస్స్టేషన్కు చేరుకొని తాము రెగ్యులర్గా డబ్బులు చెల్లిస్తున్నామని, అయినా పోలీసులు కావాలని తమ వాహనాలను పట్టుకుంటున్నారంటూ పోలీస్స్టేషన్లోనే ఆందోళనకు దిగారు. వారిపై న్యూసెన్స్ కేసుతో పాటు, పోలీస్ విధులకు ఆటంకం కలిగించడం, అక్రమ రవాణా కేసులు నమోదు చేసినట్లు తాండూరు ఎస్సై జగదీశ్ చెప్పారు.