నిజాయితీగా పని చేస్తే సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ‘పెద్ది’ నిరూపించిందని రామ్ చరణ్ అన్నాడు. చరణ్ హీరోగా బుచ్చిబాబు రూపొందించిన ఈ చిత్రం జూన్ 4న విడుదలై హౌస్ఫుల్ షోస్తో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రాబడుతోందని మేకర్స్ చెప్పారు.
ఈ నేపథ్యంలో సోమవారం మూవీ టీమ్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘నాకు తెలిసిన పని చేస్తూ ఇంత ప్రేమను పొందడం సర్ప్రైజింగ్గా ఉంది. ఇది ఎవరో పుష్ చేస్తే చేసిన సినిమా కాదు. బుచ్చిబాబు చెప్పిన కథను నమ్మి ఈ సినిమా చేసినందుకు ఎంతో సంతృప్తిగా ఉంది.
దేశవిదేశాల్లో కలెక్షన్లు పెరుగుతుండటం, ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చూసిన వాళ్లంతా చాలా ఇన్స్పైరింగ్గా ఉందని చెబుతున్నారు. నా సినీ లైబ్రరీలో నెంబర్ 1, 2 గా నిలిచే సినిమా ఇది’ అని చెప్పాడు.
డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ ‘ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఇన్స్పిరేషనల్ జర్నీ. ప్రేక్షకుల ఆదరణ చూసి చాలా ఆనందంగా ఉంది’ అని అన్నాడు. నిర్మాతగా తొలి సినిమానే ఇంత పెద్ద విజయం సాధించడం గర్వంగా ఉందని వెంకట సతీష్ కిలారు అన్నారు.
గొప్ప స్ఫూర్తినిచ్చే ఈ చిత్రాన్ని పిల్లలకు చూపించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నానని మైత్రి రవిశంకర్ అన్నారు. నటుడు జగపతిబాబు, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్, మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.
