చలాన్ కట్టినా.. ఫైన్లు కనిపిస్తున్నయ్​!

చలాన్ కట్టినా.. ఫైన్లు కనిపిస్తున్నయ్​!
  • అప్ డేట్ కాని ఈ–చలాన్ పోర్టల్
  • గత నాలుగు రోజుల్లో చెల్లించిన వారి  పరిస్థితి ఇదే..
  • చివరి రోజు తాకిడితో  బుధవారం సర్వర్ డౌన్
  • ఈ నెల 31 వరకు గడువు పెంచిన ప్రభుత్వం 
  • అప్​డేట్​ అవుతుందన్న ట్రాఫిక్​ ఉన్నతాధికారులు

కరీంనగర్, వెలుగు : వాహనాలపై ఉన్న పెండింగ్ ఛలాన్లను కట్టినా ఇంకా కట్టనట్టే చూపిస్తుండడం వెహికల్స్ ​ఓనర్లను టెన్షన్ పెడుతోంది. గత నాలుగు రోజుల్లో పేమెంట్ చేసిన అనేక మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. వాలెట్ నుంచి డబ్బులు కట్ కావడం, టీఎస్ ఈ– చలాన్ పోర్టల్​ను ఓపెన్ చెక్ చేస్తే ఫైన్లు అలాగే కనిపిస్తుండడంతో తమకు వేసిన జరిమానాలు క్లియర్ అయినట్లా..కానట్లా అనే అయోమయంలో ఉన్నారు. ఎప్పటికప్పుడు పోర్టల్ అప్ డేట్ కాకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్​ ఎదురవుతోందని ట్రాఫిక్ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లు చెప్తున్నారు. 

జనవరి10 వరకే డెడ్​లైన్​అనడంతో...

అన్ని రకాల వాహనాలపై ఉన్న పెండింగ్ ఛలాన్లపై భారీ రాయితీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు చెల్లించుకునే వెసులుబాటు కల్పించింది. బైక్ లు, ఆటో లకు 80 శాతం, కార్లు, ఇతర వాహనాలకు 60 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం రాయితీని ప్రకటించింది. చెల్లించేవారి తాకిడి ఎక్కువ కావడంతో డిసెంబర్ 28, 29 తేదీల్లో సర్వర్ డౌనయ్యింది. బుధవారం చివరి రోజు కావడంతో వాహనదారులు చలాన్లు చెల్లించడానికి పోటీ పడడంతో మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది.

పే చేశాక పోర్టల్ చెక్ చేస్తే పెండింగ్ చలానాలు ఉన్నట్టు చూపించాయి. మరోసారి ట్రై చేస్తే పేమెంట్ ఫెయిల్ అని చూపించింది.  
సర్వర్ డౌన్ తోనే సమస్య టీఎస్ ఈ–చలాన్  సర్వర్ డౌన్ కావడం వల్లే టెక్నికల్ ఇష్యూస్ తలెత్తాయని కరీంనగర్​ ట్రాఫిక్​ సీఐ రమేశ్​ చెప్పారు. త్వరలోనే అన్ని పేమెంట్స్ అప్ డేట్ అవుతాయన్నారు. లేదంటే వారంలో చెల్లించినవారి ఖాతాల్లోకి డబ్బులు జమవుతాయన్నారు. ఈ నెల 31 వరకు గడువు పెంచినందున మిగతావాళ్లు అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు.