హైదరాబాద్, వెలుగు: సిటీలో విడి పాలు కొనేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్చూపిస్తున్నారు. దీంతో శివారులో డెయిరీ ఫామ్స్ పెరిగిపోతున్నాయి. వ్యాపారులు పాలను ఇంటికే తెచ్చి పోస్తున్నారు. కొందరైతే రెగ్యులర్గా కస్టమర్లకు లీటర్ల చొప్పును సరఫరా చేస్తున్నారు. దీంతో పాల ప్యాకెట్లను కొనుగోలు చేసేవారు తగ్గిపోతున్నారు. మార్కెట్లో బ్రాండెడ్ కంపెనీల పాల ప్యాకెట్లు, బాటిళ్లు ఉన్నా, లీటర్ రూ. 50 నుంచి రూ. 60కి పైనే ధర ఉంటుంది. క్వాలిటీ, టేస్ట్ తక్కువగా ఉండడంతో స్థానిక పాల వ్యాపారుల నుంచే కొనేందుకు ఇంట్రెస్ట్ చూపుతుండగా డిమాండ్ కూడా పెరిగింది. కొందరు టీ స్టాళ్లు, హోటళ్లు, కేఫ్ లకు వందల లీటర్లు అమ్ముతుంటారు. ఒక్కో పాల వ్యాపారికి 200 మందికి పైనే రెగ్యులర్ కస్టమర్లు ఉంటున్నారు. కాలనీల్లో, అపార్ట్మెంట్లలో విడి పాలకు డిమాండ్ ఉంది.
5 వేల మందికి పైగా..
సిటీలో ఐదువేల మందికి పైగా పాల వ్యాపారులు ఉన్నారు. నాగారం, నాగోల్, బండ్లగూడ, హిమాయత్ సాగర్, నార్సింగి, మొయినాబాద్, మౌలాలి, మియాపూర్, పటాన్చెరు ప్రాంతాల్లో బర్రెలను ఎక్కువగా పెంచుతున్నారు. డెయిరీ ఫామ్స్గా, లోకల్బిజినెస్ గా కొత్త వాళ్లు కూడా వ్యాపారంలోకి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి బర్రెలను కొనుక్కొని వచ్చి, పాల వ్యాపారం చేస్తున్నారు. ఒక్కో బర్రెకు రూ. లక్ష నుంచి లక్షా20వేల వరకు ధర ఉంటుండగా రోజుకు 12నుంచి 20 లీటర్ల పాలను ఇస్తాయని వ్యాపారులు చెబుతున్నారు.
డిమాండ్ ఉండటంతో..
మా ఏరియాలో పాల వ్యాపారులకు మంచి డిమాండ్ ఉండటాన్ని చూశా. దీంతో రూ. 16 లక్షలతో 10 బర్రెలను కొన్నా. ప్రస్తుతం 250 మందికి పాలను సప్లయ్ చేస్తున్నా. క్వాలిటీ నచ్చడంతో మౌత్ పబ్లిసిటీతో కస్టమర్లు పెరిగారు. మరికొన్ని ఆవులను కూడా తీసుకోవాలనుకుంటున్నా.
- రమణ, పాల వ్యాపారి, హిమాయత్ సాగర్