లాక్ డౌన్ కు ప్రజలు సహకరిస్తున్నారు: తలసాని

లాక్ డౌన్ కు ప్రజలు సహకరిస్తున్నారు: తలసాని

సీఎం కేసీఆర్  కరోనా వైరస్ ను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వైరస్ ను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ కు ప్రజలంతా సహకరిస్తున్నారని తెలిపారు. వైరస్ బారిన పడిన బాధితులకు చికిత్స అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 20వేల బెడ్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస జీవులు తెలంగాణలో 10లక్షల మంది ఉన్నారన్న మంత్రి తలసాని..రాష్ట్ర ప్రజలతో సమానంగా వారికి కూడా నిత్యవసర వస్తువులు అందిస్తున్నామని చెప్పారు.

మరోవైపు కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి తలసాని. కొంత మంది దద్దమ్మలు గాలి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారం చేసే వాళ్లనే సీఎం విమర్శించారన్నారు. విమర్శలు చేసే వాళ్ళు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. మీడియాలో కనిపించాలనే ప్రభుత్వంపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలంటే తమకు గౌరవం ఉందన్న మంత్రి తలసాని.. ప్రజలు ఎన్ని సార్లు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నేతల్లో మార్పురావడం లేదంటూ ఆరోపించారు.

కాంగ్రెస్ బ్యాచ్ కు చెందిన కొంతమంది జూనియర్ డాక్టర్లు..కావాలనే యంత్ర పరికరాలు లేవని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.