కాంగ్రెస్ వాగ్దానాలను ప్రజలు నమ్మట్లేదు : కొండా విశ్వేశ్వర్ రెడ్ది

కాంగ్రెస్ వాగ్దానాలను ప్రజలు నమ్మట్లేదు  :   కొండా విశ్వేశ్వర్ రెడ్ది

వికారాబాద్, వెలుగు:  దేశ ప్రజలు కాంగ్రెస్ వాగ్దానాలను నమ్మడం లేదని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి.. రెండు పైసలు కూడా చేయలేదని విమర్శించారు. ప్రజా ఆశీర్వాద యాత్రకు నిరుపేదలు, వృద్ధులు ఎదురు వచ్చి పింఛన్ పెంచలేదని వాపోతున్నట్లు చెప్పారు.  కరెంటు, నీళ్ల సమస్య రోజురోజుకూ పెరిగిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ధారూర్ మండల కేంద్రంతో పాటు మన్ననూరు, సోమారం, పీలారం, రాళ్లచిత్తంపల్లి, గడ్డమీది గంగారం, నాగారం, మామిడి కలాన్ గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్రకు ప్రజల నుంచి స్పందన వచ్చింది.