భూదాన్ భూమిలో ఇండ్లకు పర్మిషన్లు .. పంచాయతీ కార్యదర్శిపై క్రిమినల్ కేసు

భూదాన్ భూమిలో ఇండ్లకు పర్మిషన్లు .. పంచాయతీ కార్యదర్శిపై క్రిమినల్ కేసు

అబ్దుల్లాపూర్ మెట్,వెలుగు: భూదాన్ భూమిలో ఎలాంటి నిర్మాణాలు లేనప్పటికీ బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చిన పంచాయతీ కార్యదర్శిపై క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారామతిపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 215, 216, 217లో 39 ఎకరాల్లో భూదాన్ భూమి ఉంది. కొన్నేండ్ల కిందట రైతులకు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. కాగా ఆ భూమిలో కొందరు  వెంచర్ వేశారు. అందులో ఎలాంటి నిర్మాణాలు లేకున్నా..  పంచాయతీ కార్యదర్శి రాజేశ్ 21 బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చారు.

కాగా.. ఆ భూమిలో ఎలాంటి  నిర్మాణాలు చేయొద్దని 2016లో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా సర్వే నంబర్ 469లో ఫంక్షన్ హాల్ నిర్మించగా.. కమర్షియల్ కాకుండా రెసిడెన్షియల్ పర్మిషన్ ఇచ్చాడు.  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు. ఎంపీవో, డీపీవో జిల్లా అడిషనల్ కలెక్టర్ కు రిపోర్ట్ అందించారు.

కార్యదర్శిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మండల అధికారులు మంగళవారం అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా కార్యదర్శి రాజేశ్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మరో పంచాయతీ కార్యదర్శి ఓపెన్ ప్లేస్ లో ఇంటి నిర్మాణం లేకున్నా ఇంటి నంబర్లు ఇవ్వడంతో కేసు నమోదైనట్టు తెలిసింది.