
హైదరాబాద్, వెలుగు: ఐఏఎస్ పదవికి రాజీనామా చేశాక దానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించకముందే పి.వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీగా నియమితులు కావడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేంద్రం ఆమోదించకముందే ఎమ్మెల్సీగా నియమితులు కావడం, ఇంకా కొనసాగడం చట్టవిరుద్ధమని, ఎమ్మెల్సీకి అనర్హుడని ప్రకటించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి, శాసనమండలికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కరీంనగర్ వాసి జె.శంకర్ మరొకరు కలిసి పిటిషన్ దాఖలు చేశారు.
ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ వేసేందుకు ఒకే ఒక్క రోజు ముందు వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారని పేర్కొన్నారు. రాజీనామాను నాటి సీఎం ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదించారన్నారు. ఐఏఎస్ పదవికి మూడు నెలల ముందే రాజీనామాకు నోటీసు జారీ చేయాలని, ఈ నోటీసును ఇతర పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర డీవోపీటీకి పంపాలని, ఆ తరువాత కేంద్రం రాజీనామాను ఆమోదించాలనే నిబంధనలు ఉన్నాయన్నారు.
అయితే, వెంకట్రామిరెడ్డి రాజీనామాను రాష్ట్రమే ఆమోదించిందని, కేంద్రం ఆమోదించకుండానే ఎమ్మెల్సీ అయ్యారని, వాస్తవానికి కేంద్రం వద్ద వెంకట్రామిరెడ్డి రాజీనామా పత్రమే లేదన్నారు. ఎమ్మెల్సీగా కొనసాగడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. ఈ పిటిషన్కు హైకోర్టు రిజిస్ట్రీ నెంబర్ కేటాయించేందుకు నిరాకరించింది. ఈ అంశంపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.