- ఏసీపీగా సివిల్ సెటిల్మెంట్లు చేసినట్టు ఆరోపణలు
- ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ
- హైదరాబాద్, సూర్యాపేట, నల్గొండ సహా 16 ప్రాంతాల్లో సోదాలు
- ఇంట్లో కిలో బంగారం, రూ.3.83 లక్షల నగదు స్వాధీనం, రూ.8 లక్షల బ్యాంకు బ్యాలెన్స్
- హైదరాబాద్లో ఐదు ఓపెన్ ప్లాట్లు, రెండు ఇండ్లు,
- సూర్యాపేట, నల్గొండలో 27 ఎకరాల వ్యవసాయ భూమి
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన మాజీ అడిషనల్ ఎస్పీ నాయిని భుజంగరావుపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా బుధవారం సోదాలు నిర్వహించింది. హఫీజ్పేట్ హెచ్ఎస్జీ హౌసింగ్ సొసైటీలోని భుజంగరావు నివాసంతో పాటు సూర్యాపేట సహా 16 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేసింది. హఫీజ్పేట్ శ్రీరామ్ టవర్స్లోని భుజంగరావు నివాసంతో పాటు దగ్గరి బంధువులు, స్నేహితులు, బినామీల ఇండ్లలోనూ సోదాలు నిర్వహించింది. ఇంట్లో రూ.3.83 లక్షల నగదు, కిలో బంగారం స్వాధీనం చేసుకుంది. బ్యాంకు బ్యాలెన్స్ రూ.8 లక్షలు సీజ్ చేసింది. వీటితో పాటు సూర్యాపేట, నల్గొండ జిల్లాలో 27.29 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో ఐదు ఓపెన్ ప్లాట్లు, రెండు ఇండ్లు, కమర్షియల్ బిల్డింగ్లకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రెండు కార్లు, ఇంట్లో 29 లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్ బాటిల్స్ను స్థానిక ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. బినామీల పేరిట ఉన్న రెండు లాకర్లను గుర్తించారు. కాగా, సోదాల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ అధికారికంగా రూ.5.92 కోట్లు ఉండగా.. ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం.. సుమారు రూ.100 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు. భుజంగరావును అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్లోని ఏసీబీ హెడ్క్వార్టర్స్కు తరలించారు. గురువారం ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరిచి, రిమాండ్కు తరలించనున్నారు.
కూకట్పల్లి, భువనగిరి ఏసీపీగా, టాప్ సీక్రెట్ సెల్ చీఫ్గా అవినీతి ఆరోపణలు!
ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడో నిందితుడిగా ఉన్న భుజంగరావును 2024 మార్చి 23న నాటి స్పెషల్ టీమ్ అరెస్ట్ చేసింది. అనారోగ్యం కారణంగా అదే ఏడాది ఆగస్టు 20న నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. భుజంగరావు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. ఏసీపీగా విధులు నిర్వహించినప్పుడే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. కూకట్పల్లి, భువనగిరి ఏసీపీగా పని చేసిన సమయంలో సివిల్ సెటిల్ చేసినట్టు ఇప్పటికే పోలీస్ హెడ్ క్వార్టర్స్కు ఫిర్యాదులు అందినట్టు తెలిసింది. కాగా, భువనగిరి ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న భుజంగరావును గత ప్రభుత్వం 2021 నవంబర్లో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా నియమించింది. టాప్ సీక్రెట్ సెల్ బాధ్యతలు అప్పగించింది.
ఆర్థిక లావాదేవీలే టార్గెట్గా..
బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు సహా వారి కుటుంబానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారి వివరాలను భుజంగరావు సేకరించేవారు. రాష్ట్రంలో మూడో సారి కూడా బీఆర్ఎస్ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా భుజంగరావు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో పెద్దల అండదండలతో భారీగా అక్రమాస్తులు కూడబెట్టాడని సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్ మెయిల్, అక్రమ వసూళ్లు!
పొలిటికల్ ఇంటెలిజెన్స్ సీక్రెట్ సెల్ ఆపరేషన్స్లో భాగంగా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు, కీలక నేతలు, వ్యాపారవేత్తల ఆర్థిక లావాదేవీలపై భుజంగరావు టాప్ సీక్రెట్ సెల్ వివరాలు సేకరించింది. ఇందులో భాగంగా వారి ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేసి వ్యక్తిగత వ్యవహారాలు గుర్తించింది. రహస్య సమాచారం తెలుసుకొని ఓ దశలో బ్లాక్ మెయిలింగ్కు కూడా పాల్పడినట్టు ఇప్పటికే సిట్ వివరాలు సేకరించింది. సిటీ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు బీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా సివిల్ సెటిల్మెంట్స్ చేసినట్టు భుజంగరావుపై ఆరోపణలున్నాయి. ఈ మేరకు భుజంగరావు ఆస్తులపై అందిన ఫిర్యాదులతో ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసి ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. తనిఖీలు గురువారం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
