
మంచిర్యాల, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తూ ఫోన్ ట్యాపింగ్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పర్మిషన్ లేకుండా ట్యాపింగ్ చేయడం అతిపెద్ద నేరమని తెలిపారు. గత ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ లీడర్ల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసిందన్నారు. ఇది నాటి సీఎం, హోం మంత్రి ఆదేశాలతోనే జరిగిందని, దీనికి వారు కూడా బాధ్యులేనని ఆరోపించారు.
తుమ్మిడి హెట్టితోనే రాష్ట్రానికి నీళ్లు..
బీఆర్ఎస్ సర్కార్ రూ. లక్ష కోట్లతో ఆర్భాటంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, దానిపై పూర్తి స్థాయిలో స్టడీ చేయనిదే వినియోగంలోకి తీసుకొచ్చే పరిస్థితి లేదన్నారు. తక్షణమే రాష్ట్ర నీటి అవసరాలను తీర్చడానికి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించడమే కాకుండా ప్రాణహిత వరదను ఎల్లంపల్లికి తరలించే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే రూ.10 వేల కోట్లతో 70 కిలోమీటర్ల మేర కెనాల్స్ తవ్వకం జరిగిందని, మరో రూ. 10 వేల కోట్లతో బ్యారేజీ నిర్మిస్తే ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.