మోదీ భయపడ్డారు.. దేశాన్ని అమ్మేశారు: ట్రేడ్ డీల్పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

మోదీ భయపడ్డారు.. దేశాన్ని అమ్మేశారు: ట్రేడ్ డీల్పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీపై లోక్ సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మంగళవారం (ఫిబ్రవరి 03) రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడుతుండగా స్పీకర్ అభ్యంతరంపై బయటకు వచ్చిన రాహుల్.. పార్లమెంటు ఆవరణలో విమర్శలు తూటాలు పేల్చారు. ప్రధానిపై రెండు రకాల ఒత్తిళ్లున్నాయి.. మోదీ భయపడ్డారు. దేశాన్ని తాకట్టు పెట్టారు.. అంటూ ఇండియా–అమెరికా ట్రేడ్ డీల్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ప్రధాని మోదీ కాంప్రమైజ్ అయ్యారు. భయపడ్డారు. తీవ్రమైన ఒత్తిడిలో సంతకాలు చేశారు.. ప్రస్తుతం తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే భయంలో ఉన్నారు అంటూ విరుచుకుపడ్డారు. గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న ట్రేడ్ డీల్ పై అత్యంత ఒత్తిడిలో సంతకాలు చేశారు. నరేంద్ర మోదీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది అని అన్నారు.

అంతకు ముందు పార్లమెంటులో ఆర్మీ మాజీ చీఫ్​ నరవనే ఆర్టికల్ పై మాట్లాడేందుకు ప్రయత్నం కొనసాగించారు. చైనా దురాక్రమణ, భారత్ వైఖరిపై ఉన్న ఆర్టికల్ పై మాట్లాడేందుకు స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేయడం.. రాహుల్ మాట్లాడే ప్రయత్నం చేయడంతో లోక్ సభలో గందరగోళం ఏర్పడింది. అధికార,ప్రతిపక్ష నేతల మధ్య యుద్ధవాతావరణంతో మైక్ కట్ చేయడంతో బయటికి వచ్చిన రాహుల్.. మీడియా పాయింట్ దగ్గర తీవ్ర విమర్శలకు దిగారు. 

Also Read : స్పీకర్‌పై పేపర్లు విసిరిన విపక్ష ఎంపీలు..

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మోదీ కాంప్రమైజ్ అయ్యారు. దేశ ప్రయోజనాలను తాకట్టుపెట్టారు. ప్రజలు దీనిగురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొదటి సారి రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడేందుకు ప్రతిపక్ష నేతను అనుమతించలేదు. ఇన్నాళ్లుగా ఎవరైతే ప్రధాని మోదీ ఇమేజ్ క్రియేట్ చేశారో వాళ్ల కారణంగానే మోదీ కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. ప్రజల కష్టాన్ని, దేశాన్ని అమెరికాకు అమ్ముకున్నారు.. అంటూ విమర్శలకు దిగారు. 

అదానీపై అమెరికాలో కేసు.. అందుకే..

మోదీ మిత్రుడు అదానీపై అమెరికాలో కేసు ఉంది. అంటే మోదీపైన కేసు ఉన్నట్లు. ఇప్పటి వరకు అమెరికా విడుదల చేయని చాలా సీక్రెట్ అంశాలు ఎప్స్టైన్ ఫైల్స్ (The Epstein Files) లో ఉన్నాయి. దీని కారణంగా మోదీ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ రెండు ఒత్తిడుల కారణంగా మోదీ దేశాన్ని తాకట్టుపెట్టారు. ఇది దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి.. అంటూ విమర్శలకు దిగారు.