
- రైతులు, మహిళలు, యువత, పేదలకే మా ప్రాధాన్యం
- పీఎం కిసాన్ స్కీం 17వ విడత నిధులు రిలీజ్
- 9.26 కోట్ల మంది రైతులకు రూ. 20 వేల కోట్ల లబ్ధి
- వారణాసిలో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళనంలో ప్రధాని స్పీచ్
- గంగా హారతిలో పాల్గొని ప్రత్యేక పూజలు
వారణాసి(యూపీ): దేశ అభివృద్ధిలో వ్యవసాయమే అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో వ్యవసాయ రంగమే పెద్ద పాత్రను పోషిస్తుందన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం (వికసిత్ భారత్)కు రైతులు, మహిళలు, యువత, పేదలే స్ట్రాంగ్ పిల్లర్స్ గా నిలుస్తారని చెప్పారు. అందుకే తన ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వం పేదలు, రైతుల కోసమే తొలి నిర్ణయం తీసుకుందన్నారు. మంగళవారం యూపీలోని వారణాసిలో జరిగిన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 17వ విడత నిధులను మోదీ విడుదల చేశారు. దాదాపు 9.26 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లోకి మొత్తం రూ. 20 వేల కోట్ల నిధులను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. పీఎం కిసాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ పథకమని అన్నారు.
ఇప్పటివరకు ఈ స్కీం కింద రూ. 3.25 లక్షల కోట్ల నిధులను కోట్లాది మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశామన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రతి డైనింగ్ టేబుల్ పైనా ఇండియాలో పండిన పంటలతో చేసిన ఒక్క ఫుడ్ ఐటమ్ అయినా ఉండాలి. ఇందుకోసం వ్యవసాయంలో ‘జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్’ ఫార్ములాను ప్రమోట్ చేయాలి” అని మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది మహిళలను ‘లఖ్ పతి దీదీస్’గా మార్చేందుకు కూడా చర్యలు ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
దేశ ప్రజలు చరిత్రాత్మక తీర్పునిచ్చారు..
ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వాలు వరుసగా మూడోసారి ఏర్పడటం చాలా అరుదని, కానీ భారత ప్రజలు దీనిని సాధ్యం చేశారని మోదీ అన్నారు. ‘‘వారణాసి ప్రజలు నన్ను మూడోసారి ఎంపీగా మాత్రమే కాదు.. మూడోసారి ప్రధానిగా కూడా ఎన్నుకున్నారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు మునుపెన్నడూ లేని విధంగా చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. కాశీ విశ్వనాథుడు, గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు, కాశీ ప్రజల ప్రేమతో నేను మూడోసారి దేశ ప్రధాన సేవకుడిని అయ్యాను. గంగమ్మ తల్లి నన్ను దత్తత తీసుకున్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు నేను ఈ ప్రాంతంలో భాగమయ్యాను” అని ప్రధాని చెప్పారు. కాగా, వారణాసి పర్యటనలో భాగంగా రాత్రి 7 గంటలకు దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగా హారతి కార్యక్రమాన్ని మోదీ తిలకించారు. అనంతరం రాత్రి 8 గంటలకు కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని, పూజలు చేశారు.
రేపు జమ్మూకాశ్మీర్కు ప్రధాని
ప్రధాని మోదీ గురువారం నుంచి రెండు రోజుల పాటు జమ్మూకాశ్మీర్ లో పర్యటించనున్నారు. శుక్రవారం శ్రీనగర్ లో10వ అంతర్జాతీయ యోగా వేడుకల్లో భాగంగా నిర్వహించే యూత్ ప్రోగ్రామ్ లో ఆయన పాల్గొననున్నారు. అలాగే దాల్ లేక్ వద్ద నిర్వహించే యోగా డే వేడుకల్లో పాల్గొని యోగాసనాలు వేయనున్నారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ జమ్మూకాశ్మీర్ లో పర్యటించనుండటం ఇదే తొలిసారి. కాగా, జమ్మూకాశ్మీర్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటం, ఇటీవల వరుస టెర్రర్ అటాక్స్ నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.