ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ తన జీవితకాలంలో ఢిల్లీలో ఆప్ని ఓడించలేరని కేజ్రీవాల్ ఉద్ఘాటించారు. ఇటీవల మద్యం కుంభకోణం కేసులో ఆ పార్టీ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'ఢిల్లీలో మద్యం కుంభకోణంలో ఏం జరిగింది.. కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది కానీ సీబీఐ, ఈడీ ఎలాంటి ఆధారాలు ఇవ్వలేకపోయాయి. సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియాలను ఫేక్ కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారు.. మమ్మల్నందరినీ జైల్లో పెట్టి మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారు. అలా ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఢిల్లీలో మమ్మల్ని ఓడించలేరని ఆయనకు తెలుసు. మమ్మల్ని జైలుకు పంపండి. ఆప్ జైల్లోంచి గెలుస్తుంది. మీ జీవితకాలంలో ఢిల్లీలో ఆప్ని ఓడించలేరని నరేంద్ర మోదీకి చెప్పాలనుకుంటున్నాను. మాపై గెలవాలంటే మీరు మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది” అని కేజ్రీవాల్.. అక్కడి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
#WATCH | Delhi CM and AAP Convener Arvind Kejriwal says, " Since AAP is growing fast, so it is natural that big conspiracies are being made against AAP. BJP and PM Modi released that they can't win against AAP in Delhi...so they made a conspiracy ' Liquor policy scam'. Actual… pic.twitter.com/WnIiwfBB4s
— ANI (@ANI) November 17, 2023
ఢిల్లీ, పంజాబ్లలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జాతీయ పార్టీగా అవతరించేందుకు గుజరాత్లో తమ సీటు ఖాతా తెరిచామని, ఏదో ఒక రోజు దేశాన్ని పాలిస్తామనే విశ్వాసాన్ని కేజ్రీవాల్ వ్యక్తం చేశారు. జైలులో ఉన్న ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ (మెడికల్ బెయిల్పై ఉన్న) నుంచి స్ఫూర్తి పొందాలని కేజ్రీవాల్.. పార్టీ కార్యకర్తలను కోరారు. భగత్ సింగ్ లాగా దేశం కోసం జైలుకు వెళ్లారని అన్నారు.