చిలుకూరు మండలం చేపల చెరువులో విషప్రయోగం..5 టన్నుల చేపలు మృతి 

చిలుకూరు మండలం చేపల చెరువులో విషప్రయోగం..5 టన్నుల చేపలు మృతి 

కోదాడ, వెలుగు : చిలుకూరు మండలం శీతలతండాలోని చేపల చెరువులో గుర్తుతెలియని వ్యక్తులు విషం కలుపడంతో సుమారు 5 టన్నుల చేపలు మృతి చెందాయి. బాధితుడి వివరాల ప్రకారం... శీతలతండాకు చెందిన రైతు బానోతు కృష్ణ ప్రభుత్వ ప్రోత్సాహంతో తన పొలంలో చేపల చెరువు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నాడు. ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అందులో విష ప్రయోగం చేశారు.

సోమవారం ఉదయం కృష్ణ చెరువు వద్దకు వెళ్లి చూడగా చేపలు చనిపోయి నీటిపై తేలుతూ కనిపించాయి. చెరువును పరిశీలించగా విష ప్రయోగం జరిగినట్లు తేలింది. తనకు రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కృష్ణ తెలిపాడు.