గచ్చిబౌలి, వెలుగు: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జనసేన పార్టీ గచ్చిబౌలిలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జూన్ 2న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంధ్య కన్వెన్షన్లో ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం’ నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేసుకున్నారు.
అనుమతి కోసం జనరల్ సెక్రటరీ తాల్లూరి రామ్ దరఖాస్తు చేసుకోగా, సైబరాబాద్ పోలీసులు తిరస్కరించారు. రాష్ట్ర అవతరణ వేడుకల వల్ల పోలీసు బలగాల కొరత ఉంటుందని, శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని శేరిలింగంపల్లి డీసీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ జనసేన నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొనడంతో రేపటి సభ నిర్వహణపై తీవ్ర సందిగ్ధత ఏర్పడింది.
పార్టీ సభకు అనుమతి నిరాకరణ బాధాకరం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్తోపాటు ఇతర రాజకీయ పార్టీలు యథేచ్ఛగా సభలు నిర్వహించుకుంటుంటే, కేవలం జనసేనకే అడ్డంకులు సృష్టించడం బాధాకరమని తెలంగాణ జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
