- రోజుకు 70 లక్షల వాహనాలు రోడ్డెక్కుతున్నయ్!
- సిటీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు
- విస్తరణకు నోచుకోని రోడ్లు ఫ్లై ఓవర్స్, స్టీల్ బ్రిడ్జిలు,
- మెట్రో వచ్చినా తప్పని తిప్పలు
- ప్రత్యామ్నాయ రూట్లను వెతుకుతున్న పోలీసులు
- ప్రధానంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్పైనే నజర్
హైదరాబాద్, వెలుగు: సిటీలో రోజురోజుకు వాహనాలు పెరిగిపోతుండగా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలతో పాటు పలు జిల్లాల్లోని వాహనాలు కూడా కారణంగా ఉంటున్నాయి. హైదరాబాద్లో ప్రతి ఏటా దాదాపు 3 లక్షలకు పైగా కొత్తగా వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్టర్ అయ్యే వాటితో పాటు వివిధ జిల్లాల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్,సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రతి రోజు దాదాపు 70లక్షల వాహనాలు రోడ్లపై తిరుతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే వారి కంటే వ్యక్తిగత వాహనాలపైనే సిటిజన్లు జర్నీ చేస్తున్నారు.
ఫుట్పాత్ల ఆక్రమణ
సిటీలో పెరిగే వాహనాలకు అనుగుణంగా రోడ్లు లేవు. ఫుట్పాత్ల ఆక్రమణ, పార్కింగ్ సమస్యలు, ఇరుకైన రోడ్లలో ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. రద్దీ ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించడంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. మరోవైపు ఫుట్ పాత్ల ఆక్రమణ కూడా ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణంగా ఉంది. వ్యాపార సంస్థలు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో రోడ్లపై వెహికల్ పార్కింగ్తో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెయిన్ రోడ్లపైన కమర్షియల్ కాంప్లెక్స్ల వద్ద సరైన పార్కింగ్ సదుపాయం లేదు. ఇలాంటి ప్రాంతాల్లోనూ పార్కింగ్, రోడ్ల విస్తరణ సవాల్గా మారింది.
సొంత వెహికల్స్ నే నమ్ముకుంటూ..
ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం, మెట్రో రైలు వచ్చినప్పటికీ సిటిజన్లకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. దీంతో రద్దీ రోడ్లపై బస్సుల్లో జర్నీ కంటే కార్లు, బైకులనే నమ్ముకుంటున్నారు. మెట్రోరైల్ వచ్చినా కనెక్టివిటీ సరిగా లేకపోగా సొంత వెహికల్స్ పైనే ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జర్నీ లేట్ అవుతుండగా.. శివారు ప్రాంతాల్లోని జనాలు సొంత వాహనాలపైనే వచ్చి వెళ్తున్నారు. బేగంపేట్, సికింద్రాబాద్, సీటీసీ, రసూల్పురా, నల్లగొండ క్రాస్ రోడ్స్, రవీంద్రభారతి, మెహీదీపట్నం, పంజాగుట్ట, హైటెక్ సిటీలోని ఐటీ కారిడార్లోనే దాదాపు 80శాతం వెహికల్స్
ట్రావెల్ చేస్తున్నాయి.
ట్రాఫిక్ ఫ్రీ రూట్ దొరికేనా..?
సిటీ ట్రాఫిక్ను గాడిలో పెట్టేందుకు సీపీ శ్రీనివాస రెడ్డి చర్యలు చేపట్టారు. బల్దియా అధికారులతో కలిసి రద్దీ ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ప్రధానంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాసబ్ట్యాంక్ పరిసర ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. అవసరమైన చోట స్టీల్ బ్రిడ్జిల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. రోడ్ల విస్తరణకు చాన్స్ లేని ప్రాంతాల్లో వన్ వే ట్రాఫిక్, డైవర్షన్స్ చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా సిద్ధం చేశారు. మెట్రో కారిడార్ రూట్లలో రోడ్లు విశాలంగా ఉన్నందున విస్తరణ అవసరం లేదని తేల్చారు. మెట్రో కింద ఇప్పటికే పలు ప్రాంతాల్లో సిగ్నల్ ఫ్రీ చేశారు. గన్పార్క్ సహా అసెంబ్లీ, మెహిదీపట్నం పరిసర ప్రాంతాల్లో మరికొన్ని సిగ్నల్ ఫ్రీ జంక్షన్స్, యూ టర్న్ల ఏర్పాటుకు ప్లాన్ రూపొందించారు. గాంధీభవన్, నాంపల్లి, రెడ్ హిల్స్ రూట్లో యూటర్న్లు ఏర్పాటు చేస్తున్నారు.