- కాల్స్ ట్యాప్ చేయాలని ఆదేశాలు ఎవరిచ్చారు?
- హార్డ్ డిస్క్ల మార్పిడి, డేటా ట్రాన్స్ఫర్పై ఆరా
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్ఐబీలో కీలకమైన సమాచారాన్ని ధ్వంసం చేయడం వెనుక ఉన్న సూత్రదారుల కూపీ లాగుతున్నారు. ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇంటెలిజెన్స్ అధికారులను విచారించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఎస్ఐబీ లాగర్ రూమ్లో పనిచేసిన ఇన్స్పెక్టర్, ఎస్సై స్థాయి అధికారులను విచారించారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రణీత్ రావు కాల్ రికార్డ్, వాట్సప్ చాటింగ్స్, ఎస్ఐబీ లాగర్ రూమ్ సర్వర్ డేటాను రిట్రీవ్ చేస్తున్నారు. లాగర్ రూమ్ ఆధారాలు కూడా సేకరించారు. ప్రణీత్ రావుతో సీక్రెట్ ఆపరేషన్ చేయించిన ఉన్నతాధికారులకు సంబంధించిన టెక్నికల్ ఆధారాలపైనే అధికారులు దృష్టి పెట్టారు. ఎస్ఐబీలో చేరినప్పటి నుంచి ప్రణీత్ రావు నిర్వహించిన విధుల వివరాలు సేకరించారు. ఎస్ఐబీలో ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. హార్డ్ డిస్క్లోని డేటాను ఎప్పటికప్పుడు ఇతర హార్డ్ డిస్క్ల్లోకి మార్చేవారని తెలిసింది. ఈ డేటాను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వార్రూమ్స్కి అందించే వారని సమాచారం. లాగర్ రూమ్లో హార్డ్ డిస్క్లు మార్చడంతో ఎఫ్ఎస్ఎల్, రిట్రీవ్ డేటాపైనే పోలీసులు ఆధారపడ్డారు.
ప్రణీత్ రావు వాట్సప్ డేటానే ఆధారం!
కాల్ డేటా సేకరించినప్పటికీ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలు లభించే అవకాశాలు లేవని తెలిసింది. దీంతో ప్రణీత్ రావు వాట్సప్ డేటాపైనే పోలీసులు ఫోకస్ చేశారు. గతంలో ఆయన వినియోగించిన ఫోన్లు, ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. మరోవైపు ప్రణీత్రావు కూడా తన వద్ద డేటాను భద్రపరిచినట్లు అధికారులు భావిస్తున్నారు. పూర్తి ఆధారాలు సేకరించేందుకు ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఇందు కోసం నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గురువారం నాంపల్లి కోర్టులో అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల పిటిషన్పై కౌంటర్ వేయాలని ప్రణీత్ రావు తరపు న్యాయవాదులకు జడ్జి సూచించారు.
సోషల్ మీడియాలో షేర్ అవుతున్న చాటింగ్
ప్రణీత్రావు ఎస్ఐబీలో ఉండగా చేసినదంటూ సోషల్ మీడియాలో వాట్సప్ చాటింగ్ ఒకటి షేర్ అవుతున్నది. అందులో ఆయన అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సంబంధించిన కొన్ని విషయాలు షేర్ చేసినట్టు ఉంది. ‘‘అక్టోబర్ 17న రేవంత్ రెడ్డి, శ్రీనివాస్, ఏఎమ్ఆర్ ను కలవడానికి ఆదికేశవులు కొడుకు శ్రీనివాస నాయుడు వస్తున్నడు. సాయంత్రం కీలక సమావేశం ఉన్నది. పెద్దపల్లి, ములుగులో జోత్స్నరెడ్డి, శివారెడ్డి డబ్బులు పంచుతున్నరు. మధుసూదన్ రెడ్డి రేవంత్ కి రూ.3 కోట్లు అరెంజ్ చేశారు. మరో కీలక వ్యక్తి రూ.80 కోట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నరు. కొండల్ రెడ్డి కో-ఆర్డినేషన్ చేస్తున్నరు. రేవంత్ వద్ద పనిచేసే నగేశ్ను కూడా ఫాలో కావాలి. అల్లపాటి విజయ్ కుమార్ ఖమ్మంకు డబ్బులు తీసుకొని వెళ్తున్నాడని తెలిసింది. కర్నాటక నుంచి అంబులెన్స్ లో డబ్బులు వస్తున్నాయని ట్యాపింగ్ ద్వారా తెలిసింది” అని చాటింగ్ లో ఉంది.