నకిలీ ఎలక్ట్రికల్ వైర్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.. .3 లక్షల 70 వేల విలువైన వైర్లు స్వాధీనం

నకిలీ ఎలక్ట్రికల్ వైర్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.. .3 లక్షల 70 వేల విలువైన వైర్లు స్వాధీనం

బషీర్ బాగ్, వెలుగు: హావెల్స్ కంపెనీ పేరుతో నకిలీ ఎలక్ట్రికల్ వైర్లను అమ్ముతున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్, అఫ్జల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాజ్ గంజ్ ఏరియాలో ఉండే లలిత్ కుమార్(27) అబిడ్స్ ట్రూప్ బజార్ లో ప్రజ్ఞ ఎలక్ట్రికల్ షాప్ ను నిర్వహిస్తున్నాడు. వ్యాపారంలో లాభాలు రాకపోవడంతో ఈజీ మనీ కోసం నకిలీ దందాకు స్కెచ్ వేశాడు. ఢిల్లీకి చెందిన దేవారామ్ తో పరిచయం పెంచుకున్న లలిత్ కుమార్.. అతడి వద్ద హావెల్స్ కంపెనీ పేరుతో ఉన్న నకిలీ వైర్లను కొన్నాడు.

ఢిల్లీ నుంచి వాటిని సిటీకి తీసుకొచ్చి ఒరిజినల్ హావెల్స్ కంపెనీ వైర్లు అని చెప్పి ట్రూప్ బజార్ లోని అతడి షాప్ కు వచ్చే కస్టమర్లకు అమ్మేవాడు. విషయం తెలుసుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు లలిత్ కుమార్ ఇంటిపై దాడులు చేశారు. రూ. 3 లక్షల 70 వేల విలువైన నకిలీ హావెల్స్ కంపెనీ వైర్లను గుర్తించారు. వాటిని సీజ్ చేశారు. నిందితుడిని అఫ్జల్ గంజ్ పోలీసులకు అప్పగించారు.