రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్న హత్య కేసులో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ గోటికె స్వప్న ఫిబ్రవరి 4న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలో దారుణ హత్యకు గురైన సంగతెలిసిందే. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఫిబ్రవరి 14న మీడియా ముందు ప్రవేశపెట్టారు.
న్యాయవాది స్వప్న హత్యకు భూ వివాదమే కారణమని నిర్ధారించారు. హత్యకు పాల్పడిన నలుగురు నిందితులలో ప్రధాన నిందితుడు స్వప్న సొంత అన్న గోటికె రాజు మరో ముగ్గురు సహచరులతో కలిసి హత్యకు కుట్ర చేసినట్లు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ డీసీపీ యోగేష్ గౌతమ్ చెప్పారు.
సర్వే నంబర్ 339లోని 4 ఎకరాల భూమిపై వివాదం. భూమి సర్వే కోసం వెళ్లిన సమయంలో నిందితులు స్వప్నపై దాడికి పాల్పడ్డారు. మొదటగా కారుతో ఢీకొట్టి, తర్వాత రాళ్లు,కర్రలతో దాడి చేసి అనంతరం కత్తితో గొంతు కోసి హత్య చేశారు. దీంతో ఘటన స్థలంలోనే స్వప్న మృతి చెందింది. హత్య అనంతరం ఇన్నోవా కార్, స్కూటీలో నిందితులు పరారయ్యారు. ఇన్నోవా కారు, స్కూటీ సీజ్ చేశాం. నలుగురు నిందితుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. హత్యకు ఉపయోగించిన కొడవలిని కూడా సీజ్ చేశాం. అని డీసీపీ యోగేష్ తెలిపారు.
నిందితులు
A1 గోటికె రాజు
A2 ఎర్రోళ్ల సందీప్
A3 వడ్డె వీరేశం..
A4 కావలి శివలింగం.
