బీసీలకు 50% సీట్లు ఇయ్యాల్సిందే : తీన్మార్ మల్లన్న

బీసీలకు 50%  సీట్లు ఇయ్యాల్సిందే : తీన్మార్ మల్లన్న
  • అన్ని పార్టీలకు బీసీ లీడర్ల డిమాండ్
  • వచ్చే నెలలో 5 లక్షల మంది బీసీలతో మీటింగ్
  • ముదిరాజ్ , పద్మశాలీల్లో చైతన్యం వచ్చింది
  • మిగతా బీసీ కులాలు కూడా నోరు విప్పాలి
  • హైదరాబాద్​లో 7 గంటలపాటు బీసీ కులాల భేటీ

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో జనాభాకు తగ్గట్టుగా అన్ని పార్టీలు తమకు 50 శాతం టికెట్లు ఇవ్వాల్సిందేనని బీసీ లీడర్లు డిమాండ్​ చేశారు. లేకపోతే ఆయా పార్టీల అధ్యక్షులను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్​లోని  ఓ హోటల్ లో  “ఎన్నికలపై బీసీ కులాల చర్చ .. రాబోయే ఎన్నికల్లో ఎవరిని ఓడించాలి” అనే అంశంపై తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో బీసీ కులాల సమావేశం జరిగింది. దీనికి బీసీల్లోని అన్ని కులాల నేతలు, మేధావులు, ఉద్యమ కారులు, విద్యార్థి నేతలు హాజరై మాట్లాడారు.

  7 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. బీసీ వర్కింగ్ కమిటీ (బీసీడబ్ల్యూసీ ) పేరుతో కమిటీ ఏర్పాటు చేయగా.. దీనికి తాత్కాలికంగా జర్నలిస్ట్ విఠల్​ను ప్రెసిడెంట్​గా , తీన్మార్ మల్లన్నను కన్వీనర్ గా ఎన్నుకున్నారు. సమావేశంలో తీన్మార్​ మల్లన్న మాట్లాడుతూ.. వచ్చే నెల మొదటివారంలో హైదరాబాద్  వేదికగా 5 లక్షల మంది బీసీలతో మీటింగ్ కు పెడుతామని, ఇందులో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ప్రకటిస్తామని చెప్పారు. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్న మీటింగ్ అని, ఓసీలకు వ్యతిరేకం కాదని అన్నారు. ముదిరాజ్ లు, పద్మశాలీల్లో చైతన్యం వచ్చిందని, మిగతా బీసీ కులాల్లో కూడా చైతన్యం రావాలని సూచించారు. కోరుట్లలో పద్మశాలీల మీటింగ్ సక్సెస్ అయిందని.. యాదవ్, గౌడ్స్ లో కూడా యూనిటీ రావాలన్నారు. 

బీసీలకు అన్ని పార్టీలు 50 శాతం టికెట్లు ఇవ్వాల్సిందేనని, లేకపోతే కేసీఆర్ ను గజ్వేల్, కామారెడ్డిలో, రేవంత్ ను కొడంగల్​లో, కిషన్ రెడ్డిని అంబర్ పేట లో ఓడిస్తామని హెచ్చరించారు.  “పార్టీల దగ్గరకు పోయి టికెట్లు అడుక్కోవడం ఏంటి? సార్ల ఇంటి ముందు కలవడం కోసం బీసీలు ఎదురు చూడాల్నా? బీసీల్లోని ప్రతి కులం నోరు విప్పాలి. రాష్ట్రంలో మిగిలిన ఉద్యమం ఉంది అంటే అది బీసీల ఉద్యమమే.. బీసీల రాజ్యం రావాల్సిందే” అని అన్నారు. పటాన్ చెరులో నీలం మధు, సూర్యాపేటలో జానయ్య యాదవ్, సిద్దిపేటలో చక్రధర్​గౌడ్​ను గెలిపించాలని కోరారు.  ప్రతి రోజు తనకు బెదిరింపులు వస్తున్నాయని,  ఇంటికి పోతానో పోనో అని రోజూ అనిపిస్తున్నదని తీన్మార్​ మల్లన్న చెప్పారు. బీసీల్లోని అన్ని కులాలు ఐక్యంగా ముందుకు సాగాలని,  అవకాశం వస్తే రాష్ట్రంలో ముదిరాజ్ వ్యక్తే సీఎం కావాలని అభిప్రాయపడ్డారు. 

ఐక్యంగా పోరాడాలి: దాసు సురేష్​

వచ్చే ఎన్నికల్లో 25 మంది బీసీలు ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని బీసీ రాజ్యాధికార సమితి ప్రెసిడెంట్ దాసు సురేష్​ అన్నారు.  ఇందుకు బీసీ సంఘాలు అన్ని మద్దతు పలికి గెలిపించాలని సూచించారు. కోరుట్లలో పద్మశాలి మీటింగ్ విజయవంతమైందని,  ఇతర బీసీలు కూడా ఐక్యంగా ఉండి పోరాటాలు చేయాలని ఆయన సూచించారు. 

కేసులకు భయపడొద్దు: చిన్న శ్రీశైలం యాదవ్

బీసీల కోసం పోరాడుతున్న తీన్మార్ మల్లన్నకు తన మద్దతు ఉంటుందని యాదవ సంఘం నేత చిన్న శ్రీశైలం యాదవ్  అన్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని, కేసులకు భయపడొద్దని అన్నారు. 

కేసీఆర్​ను గద్దె దించాలి: హనుమంతు ముదిరాజ్

ఇటీవల పరిగిలో 10 వేల మంది ముదిరాజ్ లతో భారీ ర్యాలీ తీశామని, అన్ని చోట్ల బీసీల్లో ఇదే ఐక్యత రావాలని ముదిరాజ్​ యూనియన్​ లీడర్​ హనుమంతు ముదిరాజ్ సూచించారు. బీసీలు అంతా కలిసి కేసీఆర్ ను గద్దె దించాలని అన్నారు.  

బీసీ మేలుకో.. దేశాన్ని ఏలుకో: జర్నలిస్ట్ విఠల్

సుమారు 60 శాతం దాకా ఉన్న బీసీలు రాజ్యాధికారం కోసం పోరాడాలని జర్నలిస్ట్ విఠల్  పిలుపునిచ్చారు. బీసీలు ఎవరికి వ్యతిరేకం కాదని అన్నారు.  75 ఏండ్ల తర్వాత కూడా దేశం లో బీసీల జనాభా లెక్కలు తీయడం లేదని,  ఆచరణ సాధ్యం కాదని అంటున్నారని, ఇది ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. బీసీల్లో ఉన్న 32 వృత్తి కులాల వాళ్లంతా ఏకం కావాలని సూచించారు. ‘‘బీసీ మేలుకో...దేశాన్ని ఏలుకో” అనే స్లోగన్​తో ముందుకు వెళ్దామన్నారు.