వెధవ పనులు చేశారు కాబట్టే చంద్రబాబుకు భయం : పోసాని

వెధవ పనులు చేశారు కాబట్టే చంద్రబాబుకు భయం : పోసాని

ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై సీరియస్ అయ్యారు సినీ నిర్మాత పోసాని కృష్ణమురళి. తాను ఓ ముఖ్యమంత్రికి, పౌరులకు మధ్య జరిగే సంఘటనలతో ఓ సినిమా తీస్తే.. దానిని చంద్రబాబుకు ఎలా ఆపాదిస్తారని ఆయన మండిపడ్డారు. ఎవరో కంప్లయింట్ ఇస్తే ఎన్నికల అధికారులు దీనిపై  తనను సంజాయిషీ అడగడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు ఎన్నికల అధికారులకు తాను వివరణ, సంజాయిషీలు ఇచ్చుకున్నాననీ… ప్రతిసారి తనను అమరావతి రమ్మంటే ఎలా వీలుపడుతుందని అన్నారు. ఎన్నికల అధికారుల తీరు బాగాలేదన్నారు పోసాని. చంద్రబాబుపై నేను లేఖలు రాస్తే ఆయన్ను కూడా పిలిపిస్తారా అని ప్రశ్నించారు.

చంద్రబాబు ఎందుకు తన సినిమా అంటే భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తానేమీ ఆర్జీవీలాగా బయోపిక్ తీస్తున్నానని చెప్పలేదన్నారు. ఇది వ్యక్తులకు సంబంధించిన సినిమా కాదని వివరణ ఇచ్చారు. వెధవ పనులు చేశారు కాబట్టే సీఎం .. తన సినిమా అంటే భయపడుతున్నారని.. భుజాలు తడుముకుంటున్నారని అన్నారు పోసాని.

తాను తీసిన “ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు” అనే సినిమా ఏ సీఎంను ఉద్దేశించింది కాదన్నారు పోసాని. ఈ సినిమాను కోరినవాళ్లకు ముందే చూపిస్తాననీ.. సినిమా విడుదలకు అధికార పార్టీ అడ్డుకోవద్దని అన్నారు.  చంద్రబాబును తిట్టాలంటే సినిమా తీయాలా అని ప్రశ్నించారు.  ఓ సీఎం మేనిఫెస్టో అమలుపై జనానికి ఏం చెప్పాడు.. అది చేశాడు అన్నది మాత్రమే తన సినిమాలో ఉంటుందని పోసాని చెప్పారు.