- సీఈవోకు తెలంగాణ బీసీ సంఘం వినతి
కరోనా వైరస్ నేపథ్యంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను వాయిదా వేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఎన్నికల సంఘాన్ని కోరింది. తద్వారా ఓటర్లు, ఎన్నికల అధికారులు, సిబ్బందిని కరోనా నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్కు సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ వినతిపత్రం అందించి మీడియాతో మాట్లాడారు. కరోనా ఎఫెక్టుతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నందున చాలామంది ప్రచారం చేసే అవకాశం ఉన్నదని, ప్రజా రక్షణ కన్నా ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక ముఖ్యం కాదని అన్నారు. సంఘం జనరల్ సెక్రటరీ వేల్పుల భిక్షపతి, లాయర్ల సంఘం అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ యాదవ్ సీఈవోను కలిసినవారిలో ఉన్నారు.