ఈ ఏడాది ఢిల్లీలోని లవ కుశ రామ్లీలా మైదానంలో నిర్వహించే దసరా ఉత్సవాలు వెరీవెరీ స్పెషల్. ఎందుకంటే.. ఆ విశిష్ట వేడుకల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు. ఆయనే స్వయంగా రావణ దహనం చేయనున్నారు. ఈ ఉత్సవాలకు హాజరుకావాలంటూ లవకుశ రామ్లీలా కమిటీ నుంచి ప్రభాస్ కు ఇప్పటికే ఆహ్వానం కూడా అందింది. సెప్టెంబర్ 26 నుంచి దసరా వేడుకలు ప్రారంభం కానుండగా.. ఈ ఏడాది లవకుశ రామ్లీలా కమిటీ ఎర్రకోట వద్ద అయోధ్యలోని రామాలయం థీమ్పై మండపాన్ని ఏర్పాటు చేస్తోంది.
రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాధ్ దిష్టిబొమ్మలను..
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా వేడుకలు జరుపుకుంటారు. రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. ఈ ఏడాది దసరా వేడుకల్లో రావణ దహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు.. ఆదిపురుష్ మూవీలో రాముడి పాత్రను పోషిస్తున్న ప్రభాస్ కంటే మెరుగైన వారు ఎవరుంటారని లవకుశ రాంలీలా కమిటీ చీఫ్ అర్జున్ కుమార్ వ్యాఖ్యానించారు. అందుకే ఆయనను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించామని చెప్పారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాధ్ దిష్టిబొమ్మలను ప్రభాస్ తన బాణంతో దహనం చేస్తారని ఆయన చెప్పారు. మరో విశేషం ఏమిటంటే.. ఈ ఏడాది దిష్టిబొమ్మలు 100 అడుగుల ఎత్తులో ఉండబోతున్నాయి. గతంలో అజయ్ దేవగన్ , జాన్ అబ్రహం వంటి నటులు ఈ వేడుకలలో పాల్గొన్నారు.
ఆదిపురుష్ మూవీలో..
ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్గా కనిపించనున్నాడు. 2023 జనవరి 12న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.