- 'ప్రభాత భేరి' కార్యక్రమానికి అద్భుత స్పందన
- తదుపరి కార్యాచరణపై మంత్రి జూపల్లి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: సామాజిక రుగ్మతలను రూపుమాపి, ప్రజల్లో పరివర్తన తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రభాత భేరి’ వినూత్న కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్యం, అవగాహన పెంపు లక్ష్యంగా ప్రభుత్వం ఇటీవల కవులు, రచయితలు, కళాకారుల నుంచి కథలు, కవిత్వం, పాటలు, సృజనాత్మక రచనలను ఆహ్వానించగా రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించింది.
ఈ కార్యక్రమం పురోగతి, అందిన ఎంట్రీలు, తదుపరి చర్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి కవులు, రచయితలు, కళాకారుల నుంచి వందల సంఖ్యలో రచనలు వచ్చాయని అధికారులు మంత్రికి వివరించారు. కథలు, కవితలు, పాటలు, హరికథ, బుర్రకథలకు సంబంధించిన పలు రచనలు అందినట్టు తెలిపారు. ‘ప్రభాత భేరి’ కి అద్భుతమైన స్పందన రావడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు.
సంక్రాంతిలోగా ఎంపిక పూర్తి చేయాలి: జూపల్లి కృష్ణారావు
ప్రజల్లో చైతన్యాన్ని మేల్కొలిపే శక్తి కవులు, కళాకారుల్లో ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. వచ్చిన రచనల్లో అత్యుత్తమ, ప్రభావవంతమైన, సందేశాత్మక రచనలను మూల్యాంకనం చేసే ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సంక్రాంతిలోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమాజహితం కోసం సేవ చేస్తున్న ప్రతి రచయితను, కళాకారుడిని గౌరవించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు. ఈసమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
