నయా ట్రెండ్ పేరుతో రకరకాల ఫ్యాషన్స్ వచ్చేస్తున్నాయి మార్కెట్లోకి. అలా బిడ్డ పుట్టాక పాలతో నగలు చేయించుకుంటున్నారు కొందరు. ఇంకొందరేమో రక్తంతో జువెలరీ చేయించుకుంటున్నారు. అదేంటి అంటున్నారా? ఈ జువెలరీ ఇన్స్టాగ్రామ్లో హల్చల్ చేస్తోంది. దీని వెనక కథ తెలిస్తే ఐడియా సూపర్ అనడం ఖాయం.
చనిపోయిన తండ్రి గుర్తుగా, ఆయన రక్తంతో నగలు చేయమని ప్రీతి మగ్గొ అనే జువెలరీ డిజైనర్ను అడిగింది ఒకావిడ. దాంతో చనిపోయిన ఆ తండ్రి డ్రై బ్లడ్తో చెవి దిద్దులు, లాకెట్ తయారుచేసి ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఆ జువెలరీ ఫొటోలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.
ప్రీతి మగొ ఎవరంటే...
యునిక్ జువెలరీ తయారుచేయడమే ప్రీతి మగ్గొ స్పెషాలిటీ. ఎంత యునిక్ అంటే.. డీఎన్ఏ ఉండే మెటీరియల్ అంటే చనుబాలు, వెంట్రుకలు, బొడ్డు తాడు, విరిగిన దంతాలు, గోర్లు వంటి వాటితో జువెలరీ తయారుచేస్తుంటుంది. ఇప్పుడు డ్రై బ్లడ్తో నగలు తయారుచేసింది. ‘‘మీరెవరైనా పైన చెప్పిన మెటీరియల్తో నగలు చేయించుకోవాలంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రిక్వెస్ట్ పెట్టండి” అంటోంది న్యూఢిల్లీకి చెందిన ప్రీతి మగ్గొ.
మొదట్లో ఒక కంటి ఆసుపత్రిలో ఆప్టొమెట్రిస్ట్గా పనిచేసింది ప్రీతి. ఆ టైంలోనే ఆమె ప్రెగ్నెంట్ అయింది. బిడ్డ పుట్టాక డ్యూటీ చేయడం ఇబ్బంది అవుతుందని జాబ్ మానేసింది. కానీ ఖాళీగా ఉండడం నచ్చలేదామెకు. ఇంకేదైనా చేయాలని గట్టిగా అనుకుంది. అప్పుడే ఫేస్బుక్లో చనుబాలతో తయారుచేసిన నగలు చూసింది. అవి ఆమెని అట్రాక్ట్ చేశాయి. అప్పటి నుంచే ప్రీతి జర్నీ స్టార్ట్ చేసింది. చనుబాలతో నగలు ఎలా తయారుచేస్తున్నారన్న దాని మీద రీసెర్చ్ చేసింది. తన ఆలోచన గురించి భర్తకు చెప్పింది. భర్త ఎంకరేజ్ చేశాడు.
ఆ తరువాత జువెలరీ డిజైనింగ్ మీద అమెరికాలో కొన్ని కోర్సులు చేసింది. మొదటగా ఆమె తన చనుబాలతోనే జువెలరీ తయారుచేసింది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఫ్యామిలీకి చేసిచ్చింది. అలాగని ఆమె అనుకోగానే సక్సెస్ రాలేదు. చాలాసార్లు ఫెయిలైంది. అలా ఫెయిలైన ప్రతిసారి వాటినుంచి ఎంతోకొంత నేర్చుకునేది. అలా 2019లో బిజినెస్ మొదలుపెట్టింది. ప్రీతి దగ్గర నగలు కొన్నవాళ్లు వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో కస్టమర్స్ పెరిగారు. దాంతో ఆమె బొడ్డు తాడు, వెంట్రుకలు, దంతాలతో నగలు తయారుచేయడం కూడా నేర్చుకుంది. అలాగే క్లయింట్స్ కోరిక మేరకు ఇసుక, పువ్వులు వంటి రకరకాల ఐటమ్స్తో నగలు తయారు చేస్తోంది. నగలతో పాటు.. వెంట్రుకలతో పోట్రెయిట్లు కూడా చేస్తోంది.