- ఎక్కువగా ఉండటం సంతోషకరం
- ఫ్లయింగ్ ఆఫీసర్స్ పాసింగ్ ఔట్ పరేడ్లో రాష్ట్రపతి ముర్ము
- టెక్నాలజీతో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచన
హైదరాబాద్, వెలుగు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మహిళా అధికారులు ఉత్తమ ప్రతిభ కనబర్చుతున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఫైటర్ జెట్ల పైలట్లలో ఎక్కువ మంది మహిళా ఆఫీసర్స్ ఉండడం సంతోషంగా ఉందన్నారు. ఎయిర్ఫోర్స్ కెరియర్ అనేది అనేక సవాళ్లతో కూడుకున్నదని ముర్ము అన్నారు. వాటిని అధిగమించి దేశ రక్షణ కోసం చాలెంజింగ్గా సేవ చేయాలని సూచించారు. త్రివిధ దళాలు అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ (ఫ్లయింగ్ ఆఫీసర్స్) పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి తొలిసారి రాష్ట్రపతి హాజరుకావడం విశేషం. గతంలో జరిగిన పరేడ్స్కు సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్స్, చీఫ్ ఎయిర్ మార్షల్స్ వచ్చేవారు. రాష్ట్రపతికి ఎయిర్ఫోర్స్ అకాడమీ ఘన స్వాగతం పలికింది.
ఈ సందర్భంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ ఎయిర్ ఆఫీసర్ల నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. ట్రైనింగ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నితీశ్ జాకర్కు ప్రెసిడెంట్ ఫ్లాగ్ (స్వార్డ్)ను అందించారు. 119 మంది ఫ్లయింగ్ ఎయిర్ ఆఫీసర్స్, 75 మంది గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్లకు, వారి తల్లిదండ్రులకు, ఎయిర్ఫోర్స్ సిబ్బందికి రాష్ట్రపతి శుభాకాంక్షలు చెప్పారు. సుఖోయ్ జెట్లో 2 కిలోమీటర్లు ఎత్తులో ప్రయాణించడం తనకు మంచి అనుభూతి ఇచ్చిందని, సుఖోయ్ జెట్ పని తీరును తెలుసుకున్నానని చెప్పారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత సరంగ్, చేతక్ హెలికాప్టర్, సూర్యకిరణ్ జెట్స్, ఎమ్కె–II యుద్ధ విమానాల విన్యాసాలను రాష్ట్రపతి తిలకించారు.
విజయనగరంలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకున్నాను. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పరీక్షలు రాశాను. ఎయిర్ఫోర్స్లో సెలెక్ట్ అయ్యాను. ఇది నా డ్రీమ్. దేశ సేవలోకి రావడం, ఇష్టమైన ఫ్లయింగ్లో ఉండడం చాలా సంతృప్తి కలిగిస్తున్నది. హకీంపేట్లో ఎయిర్ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్గా పోస్టింగ్ ఇచ్చారు.
- సుగురు నిఖిల్ సాయి యాదవ్, వనపర్తి