
ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆత్మనిర్బర్తో ఆధునిక భారత నిర్మాణం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. పేదలు లేని భారత్ కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ఆమె.. యువ, మహిళా శక్తి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
అవినీతి లేని దేశం వైపు భారత్ అడుగులేస్తోందని ముర్ము చెప్పారు. దేశాభివృద్ధిలో రానున్న పాతికేళ్లు అత్యంత కీలకమని అన్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న భారత్ పై ప్రపంచదేశాలన్నీ ఆధారపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు.75ఏండ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఆర్టికల్ 370 నుంచి ట్రిపుల్ తలాక్ వరకు స్థిర నిర్ణయాలతో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని ముర్ము అభిప్రాయపడ్డారు. 9ఏండ్ల పాలనలో ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని ముర్ము, పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముర్ము స్పష్టంచేశారు. దేశానికి అతిపెద్ద ముప్పుగా మారిన అవినీతిని అంతమొందించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వంలో జవాబుదారీతనాన్ని పెంచామని ముర్ము ప్రకటించారు.