రేట్లు పెరగడంతో టమాటాను
మెనూ నుంచి తీసేసిన మెక్ డొనాల్డ్స్
టమాటా రేట్ల సెగ పెద్ద కంపెనీలనూ తాకుతోంది. బర్గర్లు, పిజ్జాలు తయారుచేసి అమ్మే మెక్ డొనాల్డ్స్ సంస్థ.. తమ మెనూ నుంచి టమాటాను తొలగించింది. టమాటాలు లేకుండానే బర్గర్లు, ర్యాప్ లు సర్వ్ చేస్తామని తెలిపింది. దేశంలోని నార్త్, ఈస్ట్ ప్రాంతాల్లోని స్టోర్లలో ఈ మేరకు బోర్డులు పెట్టేసింది. ఈ ప్రాంతాల్లో మెక్ డొనాల్డ్స్ ఫ్రాంచైజీ గ్రూప్ 150 స్టోర్లను నిర్వహిస్తున్నది. గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరిగిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కిలో రూ.150 నుంచి రూ.200 పలుకుతున్నది.
రేట్లు పెరగడంతో మెనూ నుంచి టమాటాను తొలగించిన మెక్ డొనాల్డ్స్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెరుగుతున్న టమాటా ధరల సెగ ప్రముఖ రెస్టారెంట్ మెక్ డొనాల్డ్స్ కూ తగిలింది. టమాటా రేట్లు ఆకాశాన్ని తాకడంతో మెక్ డొనాల్డ్స్ తమ రెస్టారెంట్లలోని మెనూ నుంచి టమాటాను తొలగించింది. దేశంలోని తూర్పు, ఉత్తర ప్రాంతాల్లోని రెస్టారెంట్లలో ఈ మేరకు ప్రకటనల బోర్డులను తగిలించింది. టమాటాలు లేకుండానే బర్గర్లు, ర్యాప్ లు సర్వ్ చేస్తామని తెలిపింది. సప్లై కొరత, తగినంత ఉత్పాదన లేకపోవడంతో గత నెల రోజులుగా టమాటా ధరలు పెరిగిపోయి సామాన్యుడికి చుక్కలు చూపుతున్నాయి.
కొన్ని రాష్ట్రాల్లో టమాటా ధర కిలో రూ.150 నుంచి రూ.200 పలుకుతున్నది. ఉత్తరాఖండ్ లో అయితే ఏకంగా కిలో రూ.250కు చేరింది. దీంతో టమాటా లేకుండానే గృహిణులు వంట చేస్తున్నారు. వారి బాటలోనే మెక్ డొనాల్డ్స్ పయనిస్తున్నది. ‘‘దేశంలో టమాటా ధరలు విపరీతంగా పెరిగినయ్. నాణ్యమైన టమాటాలు దొరకడం లేదు. మా కస్టమర్లకు అత్యంత క్వాలిటీతో కూడిన ఫుడ్ అందిస్తం. ఎన్ని ప్రయత్నాలు చేసినా, నాణ్యమైన టమాటాలు పొందలేకపోతున్నాం. క్వాలిటీలేని టమాటాలతో బర్గర్లు, ర్యాప్ లు సర్వ్ చేయలేం.
అందుకే టమాటాలు లేకుండా ప్రొడక్టులు అందించాల్సి వస్తున్నది” అని మెక్ డొనాల్డ్స్ నార్త్, ఈస్ట్ ఇండియా తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ, నోయిడాలోని తన ఔట్లెట్లలో ప్రకటనలు విడుదల చేసింది. అయితే, ఇది తాత్కాలికమే అని మెక్ డొనాల్డ్స్ ఫ్రాంచైసీ కొనాట్ ప్లాజా రెస్టారెంట్స్ (సీపీఆర్) తెలిపింది.