Mohammed Shami: జట్టులో చేరేదెప్పుడు..? ఊత కర్రల సాయంతో నడుస్తున్న షమీ

Mohammed Shami: జట్టులో చేరేదెప్పుడు..? ఊత కర్రల సాయంతో నడుస్తున్న షమీ

టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. తన గాయం ఎలా ఉందనే విషయంపై అప్ డేట్ ఇచ్చాడు. తాజాగా తన ఎక్స్ లో ఊతకర్రలతో నడుస్తున్న ఫోటోను పోస్ట్ చేశాడు. ఓ వైపు టీమిండియా వరల్డ్ కప్ జట్టును ప్రకటిస్తే..  మరోవైపు షమీ పోస్ట్ చేసిన ఫోటోలు సగటు భారత క్రికెట్ అభిమానికి ఆవేదనను కలిగిస్తున్నాయి. 

వరల్డ్ కప్ లో గాయపడిన షమీ ఫిబ్రవరి నెలలో ఎడమ చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. లండన్‌‌‌‌లోని ఓ హాస్పిటల్‌‌‌‌లో ఈ సర్జరీ నిర్వహించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు షమీ దూరమయ్యాడు. వీటితో పాటు ఇండియాలో మెగా ఐపీఎల్, జూన్  1 నుంచి జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. షమీ చివరిసారిగా భారత్ వేదికగా 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఆడాడు. 

వన్డే ప్రపంచకప్‌లో  మహమ్మద్ షమీ అదరగొట్టాడు. మొదటి నాలుగు మ్యాచ్ లకు అతనికి అవకాశం దక్కకపోగా ఆడిన 7 మ్యాచ్ ల్లో 24 వికెట్లు పడగొట్టి లీగ్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 2023లో తన సంచలన ప్రదర్శనకు గాను ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డును అందుకున్నాడు. 33 ఏళ్ళ షమీ స్వదేశంలో బంగ్లాదేశ్ పై జరగబోయే టెస్టు సిరీస్ సమయానికల్లా కోలుకుంటాడని బీసీసీఐ సెక్రటరి జైషా గతంలో తెలిపాడు.