అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి రావాలంటూ మోదీకి ఆహ్వానం

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి రావాలంటూ మోదీకి ఆహ్వానం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహుర్తం తేదీ ఖరారైంది. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి 2024, జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. రామమందిరం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యులు ఢిల్లీలో ప్రధానిని కలిశారు.  ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మోదీని ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని ప్రధాని స్వయంగా అంగీకరించారు. 

ప్రధాని ట్వీట్‌

‘‘ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజు. ఇటీవల శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యకు రావాల్సిందిగా ఆయన నన్ను ఆహ్వానించారు. దీన్ని గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నా. నా జీవితంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. 

మూడంతస్తుల్లో నిర్మిస్తున్న రామ మందిరం ఆలయం భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణం డిసెంబర్‌ నాటికి పూర్తవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్‌ నృపేంద్ర మిశ్రా ఈ మధ్యే తెలిపారు.  2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.